Pakistan floods death toll : పాకిస్థాన్ వరదలకు 1000మంది బలి..
28 August 2022, 15:24 IST
Pakistan floods death toll : పాకిస్థాన్ వరదల కారణంగా 1,033 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వరద బీభత్సానికి 33లక్షలమందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
భారీ వర్షాలకు అల్లాడిపోతున్న పాకిస్థాన్ ప్రజలు
Pakistan floods death toll : పాకిస్థాన్ వరదల్లో మృతుల సంఖ్య 1000 మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 119మంది మరణించడంతో.. మృతుల సంఖ్య 1033కి చేరింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వరదల కారణంగా 1,527మంది గాయపడ్డారు.
పాకిస్థాన్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పటివరకు 3,451.5 కిలోమీటర్ల రోడ్లు పాకిస్థాన్ వరదలకు కొట్టుకుపోయింది. 147 బ్రిడ్జులు ధ్వంసమయ్యాయి. 170 దుకాణాలు నాశనమయ్యాయి. 9,49,858 నివాసాలు దెబ్బతిన్నాయి. వీటిల్లో 6,62,446 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 7లక్షలకుపైగా పశువులు మరణించాయి. మొత్తం మీద.. 33 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. పాకిస్థాన్ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్టు అంచనా.
Pakistan floods 2022 : 24 గంటల వ్యవధిలో మరణించిన 119మందిలో.. 76మంది ఒక్క సింధ్ రాష్ట్రంలోనే ఉన్నారు. మొత్తం మీద సింధ్లో 347మంది వరదలకు ప్రాణాలు కోల్పోయారు. బలోచిస్థాన్లో 238, ఖైబర్- పఖ్తుంక్వాలో 226, పంజాబ్లో 168, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 38, గిల్గిత్- బాల్టిస్థాన్లో 15, ఇస్లామాబాద్లో ఒకరు.. పాకిస్థాన్ వరదలకు మరణించారు.
నౌషెరా ప్రాంతంలో కాబుల్ నది.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ సమీపంలోని ప్రజలను భయపెడుతోంది. కాలాబాగ్, చష్మలో ఇండస్ నది సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పరిస్థితులను పాక్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్.. ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు.
ఆర్థిక సంక్షోభం వేళ..
Emergency in Pakistan : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు వరదలు మరో సమస్యగా మారాయి. నిధుల కొరతతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాకిస్థాన్ వరదల నేపథ్యంలో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య.. ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్.. కొన్ని రోజుల ముందే పాకిస్థాన్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.
కాగా.. పాకిస్థాన్లో తాజా పరిస్థితిని పరిశీలించిన ఐక్యరాజ్య సమితి.. ఆ దేశానికి తక్షణమే 160 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధపడిందని తెలుస్తోంది. అదే సమయంలో.. పాకిస్థాన్ మిత్రపక్షాలు కూడా.. తమ వంతు సాయం చేస్తున్నాయి. 1.5మిలియన్ పౌండ్ల సాయాన్ని ప్రకటించింది యూకే. నిధులతో పాటు 3వేల టన్నుల ఆహార పదార్థాలను కూడా పాక్కు పంపుతోంది యూఏఈ.
వరదలతో పాకిస్థాన్పై కోలుకోలేని దెబ్బపడింది. ఆ దేశం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షాలు తగ్గి, సాధారణ జీవితంలోకి వెళ్లాలని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.