UP judge sexual harassment: సాక్షాత్తూ న్యాయమూర్తికే లైంగిక వేధింపులు; చనిపోవడానికి అనుమతించాలని సీజేఐకి లేఖ
15 December 2023, 16:53 IST
UP judge sexual harassment: సాక్షాత్తూ ఒక న్యాయమూర్తే లైంగిక వేధింపులకు బాధితురాలిగా నిలిచిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, చనిపోవడానికి అనుమతించాలని ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
UP judge sexual harassment: ‘‘జీవించి ఉండాలని లేదు. జీవశ్చవంలా బతకలేను. చనిపోవడానికి అనుమతించండి.’’ అని కోరుతూ ఉత్తర ప్రదేశ్ (UTTAR PRADESH) లోని ఒక మహిళా న్యాయమూర్తి (sexual harassments on a woman judge) నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Chandrachud) కి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి, సీజేఐ (CJI) దృష్టికి వచ్చింది. దాంతో, ఆయన ఈ విషయంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హై కోర్టును ఆదేశించారు.
సీనియర్ జడ్జీ వేధింపులు..
ఉత్తర ప్రదేశ్ లోని బాందా జిల్లాలో సివిల్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న మహిళపై, ఆమె సీనియర్ అయిన ఆ జిల్లా కోర్టు న్యాయమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. దీనిపై ఆమె హై కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, అవి బుట్టదాఖలే అయ్యాయి. తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో, చావే శరణ్యమని భావించిన ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Chandrachud) కి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో, తన ఫిర్యాదుపై న్యాయంగా విచారణ జరుగుతుందని తాను భావించడం లేదని, గత సంవత్సరన్నరగా జీవశ్చవంగా బతుకుతున్నానని, ఇలాంటి జీవితం తనకు అవసరం లేదని, గౌరవంగా చనిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని ఆమె సీజేఐ ని కోరారు.
ఆత్మహత్యాయత్నం
ఆ మహిళా న్యాయమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా సీనియర్ న్యాయమూర్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెను రాత్రి సమయంలో తన ఇంటికి రావాలని వేధించేవాడు. అతడితో పాటు అతడి సన్నిహితులైన ఇతర న్యాయమూర్తులు కూడా ఆమెను వేధించేవారు. ఈ వేధింపులు భరించలేక తాను ఒక సారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశానని ఆమె తెలిపారు.
మొక్కుబడి విచారణ..
ఆ మహిళా న్యాయమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెపై సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదుపై విచారణ ప్రారంభించడానికే ఆరు నెలలు సమయం పట్టింది. ఆ విచారణ కూడా మొక్కుబడిగా సాగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి దగ్గర పని చేసే వారినే సాక్ష్యులుగా నిర్ణయించారు. వారు భయపడకుండా సరైన సాక్ష్యం ఎలా చెప్తారు? కనీసం, విచారణ ముగిసే వరకైనా, ఆ న్యాయమూర్తిని బదిలీ చేయాలని కోరాను. అదీ చేయలేదు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినా, స్పందన లేదు. ఆ తరువాత, ఆమె, 2023 జులైలో హై కోర్టు ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును సుప్రీంకోర్టు కూడా 8 సెకన్లు కూడా విచారించకుండానే కొట్టివేసిందని ఆమె తెలిపారు.