firing Twitter employees: ట్విటర్లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మస్క్ స్పందన ఇదీ
31 October 2022, 11:10 IST
- firing Twitter employees: ట్విటర్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. దీనిపై మస్క్ ఇలా స్పందించారు.
ఇలాన్ మస్క్ (ఫైల్ ఫోటో)
ట్విటర్ ఉద్యోగులను నవంబరు 1న స్టాక్ గ్రాంట్స్ స్వీకరించడానికి ముందే తొలగించేందుకు నిర్ణయం తీసుకుందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన వార్తను ఇలాన్ మస్క్ తోసిపుచ్చారు. ఓ ట్విటర్ యూజర్ ఉద్యోగుల తొలగింపు గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఇది తప్పు’ అని ట్వీట్ చేశారు.
కంపెనీలో ఉద్యోగాల కోత విధించాలని శనివారం ఇలాన్ మస్క్ ఆదేశించినట్టు ఆదివారం న్యూయార్క్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది. అలాగే కొన్ని టీమ్స్ను బాగా కుదించాలని, ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ నవంబరు 1 లోపు జరగాలని ఆదేశించినట్టు నివేదించింది. నవంబరు ఒకటో తేదీన ఉద్యోగులు తమ కంపెన్సేషన్లో భాగంగా స్టాక్ గ్రాంట్స్ స్వీకరించాల్సి ఉంది.
ఐడెంటిటీ లేకుండా కొందరు వ్యక్తులను ప్రస్తావిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని ప్రచురిస్తూ శనివారమే ఈ కోతలు మొదలవుతాయని పేర్కొంది.
భారీ చెల్లింపులను తప్పించుకునేందుకు మస్క్ టాప్ ఎగ్జిక్యూటివ్లను తొలగించారని శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. శనివారం నుంచే మరిన్ని కోతలు ఉంటాయని నివేదించాయి.
మస్క్ ఇప్పటికే ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెను ఉద్యోగాల నుంచి తొలగించారని, ఈ సమాచారం తెలిసిన వ్యక్తులు తమకు వివరించారని రాయిటర్స్ వెల్లడించింది.
ట్విటర్ ప్లాట్ఫామ్పై ఉన్న ఫేక్ అకౌంట్స్ సంఖ్య విషయంలో తనను, ట్విటర్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని మస్క్ వీరిపై ఆరోపణలు చేశారు. వీరంతా పరిహారంగా 122 మిలియన్ డాలర్లు పొందుతారని ఈక్విలర్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది.
అయితే ఈ పరిణామాలపై స్పందించాలని రాయిటర్స్ పంపిన విన్నపానికి ట్విటర్ నుంచి స్పందన రాలేదు. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ను కూడా చేరుకోలేకపోయినట్టు రాయిటర్స్ తెలిపింది.
‘తొలగింపునకు గురైన ఉద్యోగులు భారీ పరిహారాన్ని పొందుతారు. అయితే వారిని తొలగించడానికి మస్క్ వద్ద సహేతుక కారణం ఉంటే వాటిని తప్పించుకోవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించడం, కంపెనీ పాలసీని ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు..’ అని ఈక్విలర్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ కోర్ట్నీ యూ రాయిటర్స్కు వివరించారు.