Assam crime news : బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేం జరిగింది?
27 August 2023, 10:20 IST
Assam crime news : అసోంలోని బీజేపీ ఎంపీ నివాసంలో ఓ బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. ఆ బాలుడు.. ఎంపీ ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడు అని అధికారులు వెల్లడించారు.
బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేం జరిగింది?
Assam crime news : అసోంలో బీజేపీ ఎంపీ రాజ్దీప్ రాయ్ నివాసంలో 10ఏళ్ల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాలుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ జరిగింది..
అసోంలోని సిల్చార్లో బీజేపీ ఎంపీ రాజ్దీప్ రాయ్ నివాసం ఉంది. ఆయన ఇంట్లో ఓ మహిళ.. గత రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వయస్సు 10ఏళ్లు. వీరందరు రాజ్దీప్ రాయ్ నివాసంలోని మొదటి అంతస్తులో ఉంటున్నారు.
కాగా.. శనివారం మధ్యాహ్నం మహిళ, ఆమె పిల్లలు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కూతురితో కలిసి ఆ మహిళ బయటకు వెళ్లింది. వెళ్లేముందు.. ఫోన్ ఇవ్వాలని బాలుడు అడగ్గా.. ఇచ్చింది.
Rajdeep Roy latest news : కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి, గదికి లోపలి నుంచి లాక్ వేసి ఉండటాన్ని గుర్తించింది ఆ పనిమనిషి. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసింది. పోలీసులకు సమాచారం అందగా.. వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెడకు గుడ్డ చుట్టుకుని ఉన్న బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
నిజంగా ఆత్మహత్యేనా..?
బాలుడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఘటన జరిగిన సమయంలో బీజేపీ ఎంపీ రాజ్దీప్ రాయ్ ఇంట్లో లేరు. పార్టీ ఆఫీసులో ఉన్నారు. తొందరగా ఇంటికి రావాలని ఫోన్ వచ్చిందని, వెంటనే నివాసానికి వెళ్లానని ఆయన అన్నారు.
BJP MP Rajdeep Roy house : "ఎమర్జెన్సీ అని ఫోన్ వస్తే, వెంటనే ఇంటికి వెళ్లాను. 10ఏళ్ల బాలుడు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది. చాలా బాధ కలిగింది. అతను చాలా మంచి వాడు. అందరితోనూ చాలా మంచిగా ఉండేవాడు. తల్లి కూడా అందరితో బాగా ఉంటుంది. బాలుడు 5వ క్లాస్ చదువుకుంటున్నాడు. నేనే స్వయంగా అతడిని స్థానిక స్కూల్లో జాయిన్ చేశాను. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఎందుకు ఈ పని చేశాడని, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది," అని రాజ్దీప్ రాయ్ మీడియాకు వెల్లడించారు.