Kidney transplants: భారత్ లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లే ఎక్కువ; 70 శాతం అవే..
13 December 2023, 16:32 IST
Kidney transplants: భారత్ లో మూత్ర పిండాల సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. దేశంలో జరుగుతున్న అవయవ మార్పిడి ఆపరేషన్లలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్సే అత్యధికం కావడం గమనార్హం.
ప్రతీకాత్మక చిత్రం
Kidney transplants: మూత్ర పిండాల మార్పిడి ఆపరేషన్లలో భారత్ చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచంలో అత్యధిక కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ సర్జరీస్ జరిగిన దేశంగా తొలి స్థానంలో అమెరికా నిలవగా, రెండో స్థానాన్ని భారత్ సాధించింది.
మొదట కిడ్నీ, తరువాత లివర్
పెరుగుతున్న అధునాతన వైద్య విధానాల వల్ల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ఇప్పుడు సాధారణమయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారత్ లో జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల్లో కిడ్నీ మార్పిడి (kidney transplants) శస్త్ర చికిత్సలే అత్యధికంగా జరిగాయి. ఆ తరువాత స్థానాల్లో కాలేయ మార్పిడి (liver transplants), గుండె మార్పిడి (heart transplants) ఆపరేషన్లు ఉన్నాయి.
75 శాతం మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లే
భారతదేశంలో గత ఐదేళ్లలో 43,983 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు జరగగా, 13,084 లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, 911 గుండె ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు జరిగాయి. అలాగే, 699 ఊపిరితిత్తుల మార్పిడి (lungs transplants) ఆపరేషన్లు జరిగాయి. దేశంలో గత ఐదేళ్లలో జరిగిన మొత్తం అవయవ మార్పిడి ఆపరేషన్లలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లే సుమారు 75% ఉన్నాయి. వీటి తరువాత స్థానాల్లో క్లోమం (pancreas), చిన్న ప్రేవు (small intestine) మార్పిడి ఆపరేషన్లు ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ లోక్ సభకు వెల్లడించింది.
ఆర్గాన్ డొనేషన్లు పెరగడం లేదు
అవయవ మార్పిడికి సంబంధించి అవసరమైనన్ని అవయవాలు అందుబాటులో ఉండడం లేదు. అవయవ దానం చేసే వారి సంఖ్య కొరోనా కారణంగా బాగా తగ్గిపోయింది. 2019 లో 11,323 అవయవ దానాలు జరగగా, 2020 లో అది 6,812 కి తగ్గిపోయింది. కానీ, 2022 కి వచ్చేనాటికి ఆ సంఖ్య 16,041 కి పెరిగింది.