Viral News: ఎరువులపై కేంద్ర మంత్రిని ప్రశ్నించినందుకు టీచర్ సస్పెన్షన్
27 June 2022, 16:49 IST
- ఎరువుల లభ్యతపై కేంద్ర మంత్రిని ప్రశ్నించిన పాపానికి ఓ టీచర్ సస్పెండయ్యారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా (ఫైల్)
బీదర్ (కర్ణాటక), జూన్ 27: ఎరువుల సరఫరాపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబాను ప్రశ్నించినందుకు కర్ణాటకకు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని రాష్ట్ర విద్యా శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది.
ప్రశ్నలను రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీదర్ జిల్లాలోని హెదాపురా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కుశాల్ పాటిల్పై ఈ చర్య తీసుకున్నారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి భగవంత్ ఖూబాకు కుషాల్ పాటిల్ ఫోన్ చేసి ఫర్టిలైజర్ బస్తాలు దొరకడం లేదని, వీటి కొరత ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీనిపై తానేమీ చేయలేనని మంత్రి అన్నట్టు ఆ కాల్ రికార్డింగ్లో ఉంది.
కేంద్రం మంత్రి తాను ఇదివరకే రాష్ట్రాలకు ఎరువులు పంపానని, స్థానిక ఎమ్మెల్యేను కలవాలని పాటిల్కు సూచించారు. కుశాల్ పాటిల్ తాను రైతు బిడ్డగా చెప్పుకొన్నారు.
అయితే ఈ సంభాషణ చివరకు వేడెక్కింది. పాటిల్ కేంద్ర మంత్రిని తమ ఊళ్లో ఓట్లెలా అడుగుతారో చూస్తామని వ్యాఖ్యానించారు. బీదర్ లోక్సభ నుంచి మరోసారి ఎన్నిక కాబోవంటూ మాట్లాడారు.
దీనికి కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ ‘నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నాను. మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్లండి..’ అని సూచించారు.
అయితే ఈ ఆడియో క్లిప్ వైరల్ అయ్యాక దీనిపై విచారణ జరిపారు. స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక ప్రాథమిక నివేదిక సమర్పించారు.
దీని ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. టెలిఫోనిక్ సంభాషణను ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసి బాధ్యతారాహిత్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డందుకు, ఆ ఆడియో క్లిప్ను సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద వైరల్ చేసినందుకు గాను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఫర్టిలైజర్స్ గురించి అడిగినందుకు తనను శిక్షించారని, తాను వ్యవసాయ కుటుంటానికి చెందిన వాడినని, గత సీజన్లో ఫర్టిలైజర్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యానని ఏఎన్ఐ వార్తాసంస్థతో సదరు ఉపాధ్యాయుడు తెలిపారు.