Kabul blasts : గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్లో వరుస పేలుళ్లు
18 June 2022, 11:07 IST
- Kabul blast news : అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ఉన్న గురుద్వారా లక్ష్యంగా శనివారం ఉదయం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో అనేకమంది మరణించినట్టు సమాచారం.
గురుద్వారా లక్ష్యంగా అఫ్గానిస్థాన్లో వరుస పేలుళ్లు
Kabul blast news : వరుస పేలుళ్లతో అఫ్గానిస్థాన్ అట్టుడికింది. కాబుల్లోని గురుద్వారా లక్ష్యంగా శనివారం ఉదయం జరిగిన ఈ పేలుళ్లల్లో అనేక మంది మరణించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గాయపడిన వారి సంఖ్యపైనా ప్రస్తుతం స్పష్టత లేదు.
కాబుల్లోని అత్యంత రద్దీగా ఉండే కార్తే పర్వాన్ ప్రాంతంలో ఉన్న గురుద్వారాలో పేలుళ్లు జరిగాయి. అదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు.. గురుద్వారాలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. వారిని అడ్డుకునేందుకు తాలిబన్ పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నట్టు సమాచారం.
ఉగ్రవాదులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు నెలకొన్నాయి. కాగా.. పేలుళ్ల ఘటనలో గురుద్వారాకు చెందిన సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు.
భారత్ ఆందోళన..
Kabul gurdwara blast : కాబుల్ గురుద్వారా పేలుళ్లపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
2020లో కూడా కాబుల్లోని ఓ గురుద్వారాపై దాడి జరిగింది. ఆ ఘటనలో 27మంది సిక్కులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. కాగా.. అదే తరహా దాడులు చేపడతామని ఐసిస్.. ఇటీవలే ఓ వీడియోను విడుదల చేసింది. చివరికి ఐసిస్ ఉగ్రవాదులు అనుకున్నది చేశారు!
అఫ్గానిస్థాన్లోని సిక్కు సమాజంపై గత కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ను తమ వశం చేసుకున్నప్పటి నుంచి ఇవి మరింత పెరిగాయి!
టాపిక్