అక్క కోసం తెచ్చిన వరుడిని పెళ్లి చేసుకున్న చెల్లి.. స్టోరీ మామూలుగా లేదుగా!
09 May 2022, 20:19 IST
- అక్క కోసం తెచ్చిన వరుడిని ఆమె చెల్లి పెళ్లి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్లో చోటుచేసుకుంది. దీని వెనక ఓ పెద్ద కథే ఉంది.
అక్క వరుడితో చెల్లి వివాహం..!
Bride marries sister's groom | మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్క కోసం తెచ్చిన వరుడిని ఆమె చెల్లి పెళ్లి చేసుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో ఓ పెద్ద కథే ఉంది. అదేంటంటే..
అలా జరిగిపోయింది..
ఉజ్జెయిన్కు చెందిన రమేష్లాల్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు నికిత, కరిష్మ. వారిద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించాడు. రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేష్లను వరులుగా ఎంపిక చేశాడు. వారి వివాహం ఆదివారం జరిగింది. కానీ రమేష్లాల్ ఊహించిన విధంగా కాదు..!
Ujjain bride | ముసుగు ధరించి, ఒకే రకం దుస్తులు వేసుకుని భోలా, గణేష్లు పెళ్లి మండపానికి వెళ్లారు. ఆ సమయంలో కరెంట్ పోయింది. ఆగకుండా.. పెళ్లి వేడుకలు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే పురోహితుడు.. అక్కాచెళ్లల్లకు పెళ్లిచేసి ఇంటికి పంపించాడు.
తీరా.. ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఒకరు చేసుకోవాల్సి వరుడిని మరొకరు చేసుకున్నారు. అంటే.. అక్క కోసం తెచ్చిన వరుడిని చెల్లి పెళ్లి చేసుకున్నట్టు! ఈ వ్యవహారంపై ఆ కుటుంబాల్లో గొడవ జరిగింది.
చివరికి.. అందరు శాంతించారు. ప్రశాంతంగా ఆలోచించి.. ఆ మరుసటి రోజున.. మళ్లీ పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈసారి కరెక్ట్ వరుడు.. కరెక్ట్ వధువు మెడలో కరెక్ట్గా తాలికట్టాడు.
కర్రలతో కొట్టుకున్న బంధువులు..
మధ్యప్రదేశ్లో పెళ్లి నేపథ్యంలో ఇటీవల అనేక కథలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన మరో వివాహ వేడుకు ఇప్పుడు వార్తల్లో నిలించింది. వధువు, వరుడు తరఫు బంధువులు.. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. దీనంతటికీ కారణం ఓ 'షేర్వాణి'!
మధ్యప్రదేశ్ ధార్ జిల్లా మంగబేడా గ్రామంలో శనివారం జరిగింది ఈ ఘటన. షేర్వాణి ధరించి.. పెళ్లి మండపం వద్దకు వెళ్లాడు వరుడు. అది తమ సంప్రదాయం కాదని, వెళ్లి ధోతీ-కుర్తా వేసుకోవాలని వధువు తరఫు కుటుంబసభ్యులు వరుడికి చెప్పారు. అందుకు అతను నిరాకరించాడు. ఇలాంటి సంప్రదాయాలను తాను పట్టించుకోనని తేల్చిచెప్పాడు.
వారి మధ్య మాటలు నడుస్తుండగానే.. అనూహ్యంగా ఓ రాయి వచ్చి వరుడి బంధువలకు తగిలింది. వధువు తరఫు బంధువుల్లో ఒకరు.. ఆ రాయిని విసిరినట్టు తెలిసింది. ఇక అంతే! వరుడు తరఫు బంధువులు కూడా రెచ్చిపోయి.. రాళ్లు విసిరారు. చివరికి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అది సరిపోలేదనుకుని.. కర్రలు తీసుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.
పరిస్థితి కాస్త శాంతించిన తర్వాత.. వివాహ వేడుకలోని చాలా మంది.. పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఇరు కుటుంబాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
'దుస్తుల గురించి గొడవ మొదలైంది. కర్రలతో కొట్టుకుని, రాళ్లు రువ్వుకున్న వారిని మాత్రమే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను,' అని వధువు చెప్పింది.
పెళ్లి జరిగింది..!
'ఇంత జరిగిన తర్వాత ఆ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది..' అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ పెళ్లి జరగడం గమనార్హం. వధువు, వరుడు తరఫు కుటుంబసభ్యులు మండపానికి వెళ్లి వివాహ కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 'పెళ్లి చేసుకునేడట్టే అయితే.. అంత రచ్చ జరగాల్సిన అవసరం ఏముంది?' అని కామెంట్లు పెడుతున్నారు.
టాపిక్