Heatwave | ఆ ప్రాంతాల్లో 49 డిగ్రీల ఉష్ణోగ్రత.. అల్లాడిపోతున్న ప్రజలు
15 May 2022, 22:02 IST
- Heatwave Delhi | ఉత్తర భారతంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది! ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు ఎండలతో అల్లాడిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఆదివారం ఏకంగా 49డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఢిల్లీ పరిస్థితులు..
Heatwave Delhi | భానుడి భగభగలకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. తాజాగా... ఢిల్లీలో ఏకంగా 49డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు హీట్వేవ్ నేపథ్యంలో.. ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ).
మండిపోతున్న 'ఢిల్లీ'..
వాయువ్య ఢిల్లీలోని ముంగేష్పూర్లో ఆదివారం 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నజఫ్గఢ్లో 49.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 48.4, జఫర్పూర్లో 47.5, పితాంపూర్లో 47.3, రిడ్జ్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.
ఇంత వేడి మధ్య.. ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది ఐఎండీ. సోమవారం ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గురుగ్రామ్లో సైతం భారీ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. 1966 మే తర్వాత తొలిసారిగా.. అక్కడ 48.1డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.
ఆరెంజ్ అలర్డ్..
Heatwave India | హీట్వేవ్ నేపథ్యంలో.. ఉత్తర భారతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాజస్థాన్కి మాత్రం రెడ్ అలర్ట్ ఇచ్చింది.
"రాజస్థాన్లో హీట్వేవ్.. సోమవారం అత్యంత తీవ్రంగా ఉండనుంది. అందుకే రెడ్ అలర్ట్ ఇచ్చాము. ఇక పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాము," అని ఐఎండీ వెల్లడించింది.
మధ్యప్రదేశ్లో మరో 2-3రోజులు, ఉత్తర్ప్రదేశ్లో సోమవారం వరకు హీట్వేవ్ కొనసాగనుంది.
అక్కడ మాత్రం భారీ వర్షాలు..!
Kerala rain alert news | అరేబియా సముద్రంలో బలమైన గాలులు వీస్తుండటంతో.. రానున్న ఐదు రోజుల్లో కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలో కేరళలోని ఆరు జిల్లాలకు ఆదివారం.. ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
24గంటల్లో.. 20సెంటీమీటర్లు.. అంతకన్నా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే.. రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది ఐఎండీ. 6-20సె.మీ మధ్య వర్షపాతం నమోదైతే ఆరెంజ్ అలర్ట్ ఇస్తుంది. ఇక 6-11సెంటీమటర్లైతే.. ఎల్లే అలర్ట్ జారీ చేస్తుంది. ఈ క్రమంలో.. సోమవారం సాయంత్రం వరకు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
Monsoon 2022 | ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ 'చల్లటి' కబురు చెప్పింది. ఈ ఏడాది.. నైరుతి రుతుపవనాలు ఊహించని దాని కన్నా వారం రోజుల ముందే.. దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.
సాధారణంగా.. మే చివరి వారంలో అండమాన్ నికోబార్ దీవులను చుట్టి.. అటు ఇటుగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈసారి ఈ ప్రక్రియ కాస్త ముందుగానే జరుగుతుందని ఐఎండీ అంచనా వేసింది.
టాపిక్