BSF | బీఎస్ఎఫ్ క్యాంప్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి
06 March 2022, 14:33 IST
BSF | పంజాబ్ అమృత్సర్లోని బీఎస్ఎఫ్కు చెందిన 144వ బెటాలియన్ క్యాంప్లో ఆదివారం కాల్పుల మోత మోగింది. ఓ కానిస్టేబుల్.. ఐదుగురు సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్తో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జవాన్లను తరలించిన ఆసుపత్రిలో పోలీసులు
BSF jawans killed | పంజాబ్లోని అమృత్సర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు బీఎస్ఎఫ్ సిబ్బందిపై సహోద్యోగి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఖాశా ప్రాంతంలో 144వ బెటాలియన్ క్యాంప్ వద్ద ఆదివారం ఉదయం 9:30- 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సటెప్ప ఎస్ఎక్ అనే కానిస్టేబుల్.. తన సర్వీస్ రైఫిల్తో ఐదుగురు సహచరులపై కాల్పులకు పాల్పడ్డాడు. అయితే కాల్పుల అనంతరం ఎస్కే ఆత్మహత్య చేసుకున్నాడో లేక ఇతరులు ఆయనపై గన్పేల్చారో ఇంకా తెలియలేదు.
కాల్పులకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు.
ఘటనలో మొత్తం ఐదుగురు మరణించినట్టు, ఒకరు గాయపడినట్టు బీఎస్ఎప్ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు స్పష్టం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించింది. కాగా ఈ ఘటనకు గల కారణాలను బీఎస్ఎఫ్ ఇంకా బయటకు చెప్పలేదు.
సహచరులపై జవాన్లు కాల్పులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తీవ్రంగా పెరుగుతున్నాయి. గతేడాది.. ఛత్తీస్గఢ్లోని సుక్మా ప్రాంతంలో ఓ జవాను ఇతరులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సైతం స్థానికంగా కలకలం సృష్టించింది.
అయితే జవాన్లపై అధిక ఒత్తిడి ఉండటం.. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయని గతంలో మానసిక నిపుణులు చెప్పారు. పైగా జవాన్లు చాలా కాలం ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో వారిపై ఒత్తిడి మరింత పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని స్పష్టం చేశారు.