Bharat bandh today : నేడు భారత్ బంద్.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం!
16 February 2024, 6:53 IST
Bharat Bandh live updates : నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసనలను మరింత తీవ్రతరం చేయనున్నాయి.
నేడు భారత్ బంద్.. రైతన్నల ఆందోళనలు తీవ్రతరం!
Bharat Bandh 16 feb : నేడు భారత్ బంద్. సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు.. శుక్రవారం నాడు గ్రామీణ భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్ బంద్ని అత్యంత కీలకంగా భావిస్తున్నాయి రైతు సంఘాలు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు అన్ని ప్రాంతాల్లో రైతన్నలు సిద్ధమవుతున్నారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా.
నేడు భారత బంద్..
కేంద్రంపై నిరసనలు చేపట్టేందుకు అనేక రైతు సంఘాలు.. కొన్ని రోజుల క్రితం పంజాబ్, హరియాణా నుంచి దిల్లీవైపు కదిలాయి. కానీ.. వారందరిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. బ్యారికేడ్లు వేసి, భారీగా భద్రతా ఏర్పాట్లు చేసి.. వారిని దిల్లీలోకి రానివ్వకుండా చేశారు. అంతేకాకుండా.. హరియాణాలో.. రైతులపై టియర్ గ్యాస్ని సైతం ప్రయోగించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న భారత్ బంద్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్.. ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
Bharat Bandh 16 Feb Bangalore : గ్రామీణ భారత్ బంద్ కారణంగా.. రవాణా వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలు, ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్) పనులు, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామీణ దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, సర్వీస్ సేక్టార్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే.. భారత్ బంద్లో అంబులెన్స్ సర్వీసులు, న్యూస్ పేపర్ పంపిణీ, పెళ్లిల్లు, మెడికల్ షాప్లు, విద్యార్థుల పరీక్షలు వంటి ఎమర్జెన్సీ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
బ్యాంక్లు మూతపడి ఉంటాయా?
Bharat Bandh in Telangana : భారత్ బంద్ నేపథ్యంలో బ్యాంక్లు పనిచేస్తాయా? అన్న సందేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. బ్యాంక్లు మూసివేయాలని.. ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్ బంద్ తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో.. బ్యాంకింగ్ సేవలకు తీవ్ర ఆటంకం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
రైతుల డిమాండ్లు ఏంటి?
Farmers protest delhi : రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్లు ఉన్నాయి. అవి.. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం, రైతు రుణ మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, 2020 విద్యుత్ చట్టం ఉపసంహరణ, లఖింపుర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరి ఈ భారత్ బంద్పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.