Assam floods 2022 : అస్సాం వరదల్లో.. 135కు చేరిన మృతుల సంఖ్య
28 June 2022, 6:27 IST
- Assam floods 2022 : వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అస్సాంలో మృతుల సంఖ్య 135కు చేరింది. కాగా.. రాష్ట్రంలో వరదల ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
అస్సాం వరదల్లో.. 135కు చేరిన మృతుల సంఖ్య
Assam floods 2022 : అస్సాం వరదల్లో మృతుల సంఖ్య 135కు చేరింది. సోమవారం తాజాగా నాలుగు జిల్లాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.
మరోవైపు తీవ్ర అల్లకల్లోలం మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త లభించింది. ఆస్సాం వరదల ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కానీ 22జిల్లాల్లోని 2.2 మిలియన్ మంది ప్రజలపై ఇప్పటికీ వరదల ప్రభావం ఉంది. సిల్చార్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడితే.. అస్సాం వరదల్లో చిక్కుకున్న దిగువ ప్రాంతాల్లో నుంచి నీటిని తీసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు ఆశిస్తున్నారు.
ఎనిమిది మరణాల్లో ఐదు కచర్ జిల్లాలో నమోదయ్యాయి. కామ్రూప్, మోరిగాన్, నగౌన్ ప్రాంతాల్లో కలిపి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
"అస్సాం వరదల అనంతరం ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నాము. సిల్చార్ వ్యాప్తంగా శానిటైజేషన్ చేసేందుకు ప్రణాళికలు రచించాము," అని ఓ అధికారి వెల్లడించారు.
ప్రస్తుతం.. రోడ్డు మార్గం అందుబాటులో ఉన్న ప్రాంతాలకు సహాయక సామాగ్రి అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హెలికాఫ్టర్ల సాయంతో ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
ఓవైపు అస్సాం వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు వరద బాధితులను ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ఎప్పటికప్పుడు పరామర్శిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతున్నారు.