Nupur Sharma | ఎవరు ఈ నూపూర్ శర్మ? అసలేంటి వివాదం?
06 June 2022, 17:14 IST
- Nupur Sharma comment | మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు నూపూర్ శర్మ. ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అసలు ఎవరు ఈ నూపూర్ శర్మ?
నూపూర్ శర్మ
Nupur Sharma comment | 'నూపూర్ శర్మ..' ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇంత వరకు వార్తల్లో పెద్దగా కనిపించని నూపూర్ శర్మ.. ఇప్పుడు పత్రికల్లోని మొదటి పేజీల్లో దర్శనమిస్తున్నారు. ఈమె వల్ల అనేక దేశాల ముందు భారత ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకి.. అసలేవరు ఈ నూపూర్ శర్మ?
లాయర్.. టు పొలిటీషియన్..
నూపూర్ శర్మ వృత్తి రిత్యా ఓ న్యాయవాది. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి అమె సేవలందిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన నూపూర్ శర్మ.. 2011లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎల్ఎల్ఎం పొందారు. 2009-2010 మధ్య కాలంలో 'టీచ్ ఫర్ ఇండియా'కు అంబాసిడర్గా కూడా పనిచేశారు.
Nupur Sharma BJP | చదువుకునే రోజుల్లోనే.. నూపూర్ శర్మ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కాగా.. ఆమె రాజకీయ జీవితం మాత్రం 2008లో మొదలైంది. నాడు.. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలోని యువజన విభాగంలో పని చేశారు.
2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేసి ఓడిపోయారు.
వివాదాస్పద వ్యాఖ్యలు..
గత శుక్రావారం.. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా.. దేశంలో మతపరమైన ఘర్షణలు ఇటీవల ఆందోళనకర రీతిలో పెరిగిపోయాయి. ఇండియాలో పరిస్థితులు, మైనారటీల సమస్యలపై ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఈ సమయంలోనే.. బీజేపీకి చెందిన నేత ముస్లింలపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. గత ఆదివారం ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న బీజేపీ నేత నూపూర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఉన్నాయి.
India Prophet controversy | నూపూర్ శర్మ వ్యాఖ్యలపై నిరసనలు భగ్గుమన్నాయి. దేశంలోని విపక్షాలతో పాటు గల్ఫ్ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేసి.. బీజేపీ నేతల వ్యవహారాన్ని తప్పుబట్టాయి. నూపూర్ శర్మ వ్యాఖ్యలు.. కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించిన సౌదీ అరేబియా.. అన్ని మతాలను, నమ్మకాలను గౌరవించాలని హితవు పలికింది. ఖతార్, కువైట్, ఇరాన్ దేశాలు.. భారత రాయబారులకు సమన్లు జారీ చేసి.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించాయి. అంతేకాకుండా.. గల్ఫ్ దేశాల్లో భారత వస్తువులపై నిషేధం విధించాలని డిమాండ్లు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గల్ఫ్తో వాణిజ్యపరమైన బంధాన్ని పెంచుకునే దిశగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఖతార్లో పర్యటిస్తున్న వేళ ఈ ఘటన జరగడం ఇప్పుడు భారత అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ దేశాల ఆగ్రహావేశాల మధ్య.. భారత్ ప్రభుత్వం వైఖరి.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలాగే ఉంది! పరిస్థితులను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఘటనకు గల కారణమైన నూపూర్ శర్మను సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
టాపిక్