Major blasts plan in Bengaluru: బెంగళూరులో వరుస పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర; తప్పిన పెను ముప్పు; ఐదుగురి అరెస్ట్
19 July 2023, 12:41 IST
Major blast plan in Bengaluru: కర్నాటక రాజధాని, దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరు నగరానికి పెను ముప్పు తప్పింది. బెంగళూరులో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. ఐదుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానిత ఉగ్రవాదులు సుహేల్, ఉమర్, జానిద్, ముదస్సిర్, జాహిద్
Major blast plan in Bengaluru: కర్నాటక రాజధాని, దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరు నగరానికి పెను ముప్పు తప్పింది. బెంగళూరులో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. ఐదుగురు అనుమానిత టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
Terror plot foiled: జైళ్లో పరిచయం
విశ్వసనీయ సమాచారం లభించడంతో కర్నాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ - సీసీబీ (CCB) పోలీసులు బుధవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్న స్థావరంపై దాడి చేసి, అక్కడ ఉన్న ఐదుగురు అనుమానిత టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేశారు. వారిని సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదస్సిర్, జాహిద్ లుగా గుర్తించారు. 2017 లో ఒక హత్య కేసులో దోషులుగా బెంగళూరు సెంట్రల్ జైళ్లో ఉన్న సమయంలో వీరికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, ఆ టెర్రరిస్ట్ ల సూచనల ప్రకారం.. ఈ ఐదుగురు బెంగళూరులో వరుస పేలుళ్లకు పాల్పడి, పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు తీయాలని, నగరంలో విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశారని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్రూప్ కు వేరే ఎవరైనా సహకరిస్తున్నారా? పేలుళ్లను ఎక్కడ, ఎలా ప్లాన్ చేశారు? అనే అంశాలపై వారిని ప్రశ్నిస్తున్నారు.
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదస్సిర్, జాహిద్ ల వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడు పిస్టల్స్, భారీగా లైవ్ బుల్లెట్స్, ఇతర పేలుడు పదార్ధాలు వాటిలో ఉన్నాయి. ఈ ఐదుగురికి ఈ ఆయుధాలను, పేలుడు పదార్ధాలను సరఫరా చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఐదుగురు బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. బెంగళూరులో ఏయే ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలనే విషయంలో వారు ఇప్పటికే ఒక ప్లాన్ రూపొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎన్ఐఏకు అప్పగించాలి..
ఇది చాలా పెద్ద ఉగ్ర కుట్ర అని, ఈ కేసును వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National Investigation Agency NIA)) కి అప్పగించాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై డిమాండ్ చేశారు. బెంగళూరులో వరుస పేలుళ్లకు పాల్పడి నగరంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి ప్లాన్ చేశారని, వీరి వెనుక ఇంకా చాలా మంది ఉండి ఉండవచ్చని, అందువల్ల ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని ఆయన కోరారు.