ఆయుర్వేద ఔషధం 'ఆయుష్64' ను కరోనా చికిత్స కోసం ఎలా వినియోగించవచ్చు?
30 December 2021, 17:23 IST
- కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్) అభివృద్ధి పరిచిన కరోనా ఔషధం 'ఆయుష్-64'. ఇది తేలికపాటి నుండి మితమైన కేసులలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
Ayush-64 Drug
వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చినా కరోనావైరస్ అంతం ఎప్పుడనేది అంతుచిక్కకుండా ఉంది. ఈ మహమ్మారి ఎప్పటికప్పుడు మ్యుటేషన్ చెందుతూ కొత్త వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. దీంతో ఒకవైపు కోవిడ్ వ్యాక్సిన్లతో పాటుగా కోవిడ్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండటం మరో విశేషం.
కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్) అభివృద్ధి పరిచిన కరోనా ఔషధం 'ఆయుష్-64' , తేలికపాటి నుండి మితమైన కేసులలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని వాస్తవానికి మలేరియా చికిత్స కోసం 1980లో అభివృద్ధి చేశారు. ఇందులో యాంటీవైరల్, ఇమ్యూన్-మాడ్యులేటర్, యాంటిపైరేటిక్ లాంటి గుణాలున్నాయి. ఇన్ ఫ్లూయింజా లాంటి సంక్రమణలపైనా ఇది ప్రభావవంతంగా పనిచేసింది. ఇప్పుడిది కోవిడ్ బారి నుంచి కూడా రక్షణ కల్పిస్తుండటంతో దీని డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఔషధం సప్లయిని మరింత పెంచేందుకు ఆయుష్-64 సాంకేతికతను దేశంలోని 46 ఔషధ కంపెనీలకు బదిలీ చేసినట్లు కేంద్రం ఇటీవల పేర్కొంది.
ఆయుష్ -64 తీసుకోవడంలో మార్గదర్శకాలు:
కరోనా పాజిటివ్ అని తేలినపుడు ఏ దశలోనైనా రోగులు దీనిని తీసుకోవచ్చు. అయితే తీవ్రమైన లక్షణాలు కలిగిన వారు కాకుండా తేలికపాటి, మితమైన లక్షణాలు కలిగిన వారిలో ఆయుష్ -64 సమర్థవంతమైన ఫలితాన్ని చూపించినట్టు అధ్యయనంలో వెల్లడయింది. అత్యవసర సహాయం లేదా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వారు ఆయుష్-64 తీసుకోవడానికి అర్హులు. జ్వరం, అనారోగ్యం, శరీర నొప్పి, జలుబు, తలనొప్పి, దగ్గు మొదలైన ప్రారంభ లక్షణాలను కలిగిన వారు, ఆర్టీ-పిసిఆర్ పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ జరిగిన 7 రోజుల్లో ఆయుష్ 64 తీసుకోవడం ప్రారంభించవచ్చు. ఇది 500 ఎంజీ మాత్రలుగా లభిస్తుంది. దీనిని 14 రోజుల పాటు భోజనం చేసిన గంట తర్వాత గోరువెచ్చని నీటితో రోజుకు రెండు లేదా మూడు పూటలు తీసుకోవాలి.
ఆయుష్ 64 రోగి క్లినికల్ రికవరీ వేగాన్ని గణనీయంగా పెంచుతుందని నిరూపితమైంది. ఇది సాధారణ ఆరోగ్యం, అలసట, ఆందోళన, ఒత్తిడి, ఆకలి, నిద్రలేమి తదితర సమస్యలపై మంచి ఫలితాలను చూపించింది.
ఎవరైనా తీసుకోవచ్చు..
దీనిని కోవిడ్ లక్షణాలు కలిగిన ఏ వ్యక్తి అయినా తీసుకోవచ్చు. రక్తపోటు, డయాబెటిస్ మొదలైన ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా దీనిని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఆయుష్ 64 తీసుకున్న కొంతమందికి విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి వైద్యుల చికిత్స అవసరం లేదని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.
ఆయుష్ 64 ఔషధాన్ని గర్భిణీలు తీసుకోవచ్చా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. దానిపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నట్లు ఆయుర్వేద పరిశోధకులు వెల్లడించారు.
టాపిక్