Heeramandi OTT Release Date: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
30 April 2024, 7:49 IST
- Heeramandi OTT Release Date: ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ అయిన హీరామండి మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ డైరెక్ట్ చేశాడు.
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
Heeramandi OTT Release Date: ఒక వెబ్ సిరీస్ ను రూ.200 కోట్ల పెట్టి తీశారంటే నమ్మగలరా? ఇప్పుడీ సిరీస్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సిరీస్ లలో ఒకటైన హీరామండి బుధవారం (మే 1) నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.
హీరామండి ఓటీటీ రిలీజ్ డేట్
హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ కోసం చాన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వెండి తెరపై తన కళాఖండాలతో మ్యాజిక్ చేసిన భన్సాలీ.. తొలిసారి ఓటీటీలోకి అడుగు పెడుతుండటం, అందులోనూ వచ్చీ రావడంతోనే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటి వరకూ వచ్చిన అన్ని వెబ్ సిరీస్ ల కంటే ఈ హీరామండి బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం. దీనికి ఎందుకంత భారీ బడ్జెట్ అవసరమైందో ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. తన కెరీర్లో దేవదాస్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలాలాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన భన్సాలీ.. అదే భారీతనాన్ని తన తొలి వెబ్ సిరీస్ లోనూ చూపించబోతున్నట్లు స్పష్టమైంది.
హీరామండి నటీనటులు
బాలీవుడ్ లోని ప్రముఖ నటీమణులు ఎంతో మంది ఇందులో నటించారు. సీనియర్ నటి మనీషా కొయిరాలాతోపాటు సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి వాళ్లు ఈ సిరీస్ లో నటించారు. భన్సాలీతోపాటు వీళ్ల రెమ్యునరేషన్ల కోసమే మేకర్స్ భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయడంతోపాటు తానే ప్రొడ్యూస్ కూడా చేశాడు భన్సాలీ.
హీరామండి ఓ పీరియడ్ డ్రామా. దేశానికి స్వతంత్రం రాక ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో కొందరు వేశ్యల విలాసవంతమైన జీవితాలు, ఈ ఉద్యమంలో వాళ్ల పాత్రను ఈ సిరీస్ ద్వారా భన్సాలీ కళ్లకు కట్టు ప్రయత్నం చేస్తున్నారు. 2021లో ఈ వెబ్ సిరీస్ ను భన్సాలీ అనౌన్స్ చేశాడు. అయితే జూన్, 2022లో ఈ షూటింగ్ మొదలైంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చి.. మొత్తానికి మే 1న నెట్ఫ్లిక్స్ లో అడుగు పెట్టబోతోంది.
హీరామండి రెమ్యునరేషన్లు
హీరామండి వెబ్ సిరీస్ కోసం రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. డైరెక్టర్ భన్సాలీయే ఏకంగా రూ.60 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో నటిస్తున్న వాళ్లలో అత్యధికంగా సోనాక్షి సిన్హా రూ.2 కోట్లు తీసుకుందట. అదితి రావ్ హైదరీ రూ.1.5 కోట్లు, మనీషా కొయిరాలా, రిచా చద్దా చెరో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నారు.
హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ చూడొచ్చు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండి ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.
టాపిక్