Pooja Hegde: పూజా హెగ్డేకు చంపుతామంటూ బెదిరింపులు.. అసలు ఏం జరిగిందంటే?
14 December 2023, 15:55 IST
Pooja Hegde Threatening: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు తెలుగులో ప్రస్తుతం సినిమాలు లేవు. ఇదిలా ఉంటే పూజా హెగ్డేను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఇటీవల ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై తాజాగా అసలైన క్లారిటీ ఇచ్చింది పూజా హెగ్డే టీమ్.
పూజా హెగ్డేను చంపుతామంటూ బెదిరింపులు.. అసలు ఏం జరిగిందంటే?
Threatening To Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే (Pooja Hegde). మాస్క్ అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటిఫుల్ మొదట మోడలింగ్ బాటలో పయనించింది. మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకుని పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన పూజా హెగ్డే మాస్క్ అనే మూవీలో హీరోయిన్గా అవకాశం కొట్టేసింది.
ఇక తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా చేసిన ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. దీని తర్వాత వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో ముకుంద మూవీలో జత కట్టింది. మొదటి రెండు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటి అల్లు అర్జున్ డీజే మూవీతో గ్లామర్ ఒలకబోయడం ప్రారంభించింది. అనంతరం పెద్ద హీరోలతో నటించడం, అవి కాస్తా హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది పూజా హెగ్డే.
అల వైకుంఠపురములో సినిమాతో నేషనల్ వైడ్గా చాలా పాపులర్ అయింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కానీ, ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే నటించిన సినిమాలు దాదాపు అన్ని వరుసగా ప్లాప్ కావడంతో ఆమె సినీ కెరీర్ స్లోగా సాగుతోంది. ఇటీవల మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తొలగిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేని పూజా హెగ్డే హిందీలో షాహిద్ కపూర్ దేవా మూవీలో హీరోయిన్గా చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఇటీవల పూజా హెగ్డేకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అయింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పూజా హెగ్డే దుబాయ్ వెళ్లిందని, అక్కడ గొడవ జరగడంతో కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పూజా హెగ్డే ఫ్యాన్స్ షాక్ అయి ఆందోళన చెందారు. అసలు ఏం జరిగిందంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టులు పెట్టారు. దీంతో తాజాగా పూజా హెగ్డే టీమ్ స్పందించింది.
"అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారో తెలియదు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు" అని పూజా హేగ్డే టీమ్ ప్రకటించి స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వార్తలను కూడా డిలీట్ చేయించింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న పూజా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.