Celebrity Cricket League 2024: కాలేజ్ స్టూడెంట్స్కు బంపర్ ఆఫర్.. హైదరాబాద్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫ్రీగా చూడొచ్చు
24 February 2024, 12:58 IST
- Celebrity Cricket League 2024: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా హైదరాబాద్ లో జరగనున్న మ్యాచ్ లకు కాలేజీ స్టూడెంట్స్ ను ఉచితంగా అనుమతించనున్నారు. ఈ విషయాన్ని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వెల్లడించారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 ట్రోఫీతో జట్ల కెప్టెన్లు, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు అఖిల్, వెంకటేశ్, సల్మాన్ ఖాన్
Celebrity Cricket League 2024: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 (సీసీఎల్ 2024) శుక్రవారం (ఫిబ్రవరి 23) షార్జాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ లీగ్ లో భాగంగా మూడు మ్యాచ్ లు హైదరాబాద్ లో జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లను కాలేజీ విద్యార్థులు ఫ్రీగా చూసే అవకాశం కల్పించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024
ఈ ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా హైదరాబాద్ లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 1న ఒక మ్యాచ్, మార్చి 3న రెండు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీమ్ పంజాబ్ దె షేర్ టీమ్ తో తలపడనుంది. ఇక ఆ తర్వాత మార్చి 3న భోజ్పురి దబంగ్స్, చెన్నై రైనోస్ మధ్య తొలి మ్యాచ్.. కేరళ స్ట్రైకర్స్, తెలుగు వారియర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది.
ఈ మూడు మ్యాచ్ లు కలిపి 10 వేల మంది కాలేజీ స్టూడెంట్స్ కు ఉచితంగా టికెట్లు ఇవ్వనున్నట్లు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు శుక్రవారం (ఫిబ్రవరి 23) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ టికెట్ల కోసం ఆసక్తి ఉన్న కాలేజీల ప్రిన్సిపల్స్.. hca.ccl2024@gmail.com కు మెయిల్ చేయాలని ఆయన కోరారు. అందులో తమ కాలేజీ నుంచి ఎంత మంది వస్తున్నారు? వాళ్ల పేర్లు ఏంటన్నది కూడా స్పష్టంగా ఉండాలని చెప్పారు.
సీసీఎల్ 2024 షెడ్యూల్ ఇదీ
ఈ ఏడాది సీసీఎల్ ఫిబ్రవరి 23నే షార్జాలో ప్రారంభమైంది. ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగగా.. ముంబై టీమ్ 9 పరుగులతో గెలిచింది. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్ లు షార్జాలోనే జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగు వారియర్స్ టీమ్ తమ తొలి మ్యాచ్ లో భోజ్పురి దబంగ్స్ తో తలపడనుంది.
ఈ మ్యాచ్ లను జియో సినిమా యాప్, వెబ్సైట్ లలో ఉచితంగా చూడొచ్చు. ఇక టీవీలో చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మార్చి 17 వరకూ సీసీఎల్ 2024 జరగనుంది. మార్చి 17న విశాఖపట్నంలో ఫైనల్ జరగనుంది. అంతకుముందు క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు కూడా వైజాగ్ లోనే జరగనున్నాయి. అంటే ఈసారి విశాఖలో మొత్తం నాలుగు మ్యాచ్ లు జరగనుండటం విశేషం.
తెలుగు వారియర్స్ టీమ్ ఇదే
ఈసారి అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో తెలుగు వారియర్స్ టీమ్ బరిలోకి దిగుతోంది. ఈ టీమ్ కు వెంకటేశ్ మెంటార్ గా ఉన్నాడు. అఖిల్ తోపాటు సచిన్ జోషి, అశ్విన్ బాబు, ధరమ్, ఆదర్శ్, నిఖిల్, రఘు, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూమ్, హరీష్, నంద కిశోర్, సామ్రాట్ లాంటి ప్లేయర్స్ తెలుగు వారియర్స్ జట్టులో ఉన్నారు.
టాపిక్