Kamal Haasan | కమల్ డేట్స్ కోసం చూస్తోన్న రాజమౌళి, ప్రశాంత్ నీల్.. ఎందుకంటే?
21 May 2022, 15:55 IST
- కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ఆయన తెరకెక్కించే తర్వాతి చిత్రంలో కమల్కు కీలక పాత్ర ఇచ్చారట. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ సినిమాలోనూ ఈ విలక్షణ నటుడు నటించనున్నాడని సమాచారం.
కమల్ హాసన్
భారత చిత్రసీమలో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎప్పుడూ విభిన్న చిత్రాలకు ప్రాధాన్యమిచ్చే కమల్.. ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించడానికి ఎంత దూరమైన వెళ్తారు. ప్రస్తుతం ఆయన నటించిన విక్రమ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. కమల్ డేట్స్ కోసం ఇద్దరు పెద్ద దర్శకులు ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో దర్శక దిగ్గజం రాజమౌళి, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్. వీరిద్దరూ తాము తెరకెక్కించనున్న తర్వాతి చిత్రాల్లో కమల్ హాసన్ను తీసుకోనున్నారట.
రాజమౌళి..మహేశ్ బాబు హీరోగా SSMB29 చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం కమల్ హాసన్ను తీసుకోవాలని చూస్తున్నారట. ఇందుకు సంబంధించిన ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కించనున్న NTR31లోనూ లోకనాయకుడికి కీలక పాత్రను ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చేంత వరకు వేచి ఉండాలి.
ప్రశాంత్ నీల్ ఇటీవలే కేజీఎఫ్ ఛాప్టర్-2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆయన తర్వాత చిత్రాన్ని ప్రభాస్ హీరోగా సలార్ను తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత తారక్తో ఎన్టీఆర్31కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం తారక్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.
మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే సినిమాలో చూపించి అభిమానులను అలరించారు. ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన.. తన తర్వాతి చిత్రాన్ని మహేశ్తో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం మేకర్స్ తెలియజేయనున్నారు.
టాపిక్