World Cup 2023: భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. పిచ్ను పరిశీలించిన ద్రవిడ్, రోహిత్.. ఎవరికీ అనుకూలం అంటే?
18 November 2023, 10:47 IST
World Cup 2023 Ind vs Aus Match Pitch: ఐసీసీ వరల్డ్ కప్ 2023 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్ధమయ్యాయి. మ్యాచ్లో కీలకంగా మారనున్న అహ్మదాబాద్ పిచ్ను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిశీలించారు.
భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. పిచ్ను పరిశీలించిన ద్రవిడ్, రోహిత్.. ఎవరికీ అనుకూలం అంటే?
ICC World Cup 2023 Final: ఐసీసీ వరల్డ్ కప్ 2023 మెగా టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రపంచ కప్ విజేత ఎవరో తెలుసుకునేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. సుమారు పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపైన వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్ ఇప్పుడు బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
వీక్ పాయింట్స్
టోర్నమెంట్లో ఆరంభం నుంచి ఓటమి లేకుండా ముందుకు సాగిన భారత్ తుది పోరులో కూడా విజేతగా నిలిచేలా కంగారులతో పోటీకి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. ప్రత్యర్థ జట్టు బలాలు, వీక్ పాయింట్స్ ను విశ్లేషిస్తూ వాటికి తగినట్లుగా సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా నవంబర్ 17న ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది.
పిచ్ పరిశీలన
ఆప్షనల్ ప్రాక్టీస్ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ అంతా మాంబ్రే మైదానానికి వచ్చారు. రోహిత్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తే.. కొంతసేపు జడేజా, ఇషాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతరం ద్రవిడ్తో కలిసి రోహిత్ శర్మ అహ్మదాబాద్ పిచ్ను పరిశీలించాడు. బీసీసీఐ క్యూరెటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీతోపాటు స్థానిక క్యూరెటర్ జయేష్ పటేల్తో చర్చించాడు.
నల్ల మట్టితో పిచ్
ఇదిలా ఉంటే, ప్రపంచకప్ 2023 లీగ్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరిగింది. అప్పుడు అక్కడ బ్లాక్ సాయిల్తో (నల్ల మట్టి) ఉన్న పిచ్ను రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఆఖరి పోరుకు కూడా ఇదే రకమైన పిచ్ను వాడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన పిచ్ క్యూరేటర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వారికి అనుకూలం
"బ్లాక్ సాయిల్ స్ట్రిప్ ఉన్న పిచ్పై హెవీ రోలర్ ఉపయోగిస్తే.. స్లో బ్యాటింగ్ ట్రాక్ తయారు చేసే వీలుంటుంది. ఇక్కడ 315 పరుగులు చేస్తే బెటర్. లక్ష్య ఛేదన కోసం దిగే జట్టుకు మాత్రం కష్టాలు తప్పవు" అని ఆయన తెలిపారు. "ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఆండీ ఆట్కిన్సన్ ఇండియాలోనే ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చారు. కానీ, గ్రౌండ్ను పరిశీలించలేదు. అయితే, శనివారం అందుబాటులో ఉంటారు" అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.