Sehwag on Pakistan Team: పాకిస్థాన్ ‘జిందాభాగ్’ అంటూ సెహ్వాగ్ పోస్ట్.. ‘బిర్యానీ’ పంచ్ కూడా..
10 November 2023, 17:51 IST
- Sehwag on Pakistan Team: పాకిస్థాన్ టీమ్పై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తన మార్క్ పంచ్ వేశారు. ‘జిందాభాగ్’ అంటూ పోస్ట్ చేశారు.
వీరేందర్ సెహ్వాగ్ - పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (PTI)
Sehwag on Pakistan Team: ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు రాణించలేకపోయింది. దాదాపు సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లండ్తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయినా, ఆ మ్యాచ్లో దాదాపు 280 పరుగుల భారీ తేడాతో లేదా లక్ష్యఛేదనలో అయితే 5 ఓవర్లలోనే గెలిస్తేనే పాకిస్థాన్కు సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయి. అయితే, అవి దాదాపు అసాధ్యం. దీంతో పాక్కు సెమీస్ అవకాశాలు లేనట్టే. గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై న్యూజిలాండ్ గెలవటంతో ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడం దాదాపు ఖరారైంది. ఈ తరుణంలో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్.. పాకిస్థాన్ జట్టుకు చురకలు అంటించారు.
పాకిస్థాన్ జట్టును సెహ్వాగ్ ట్రోల్ చేశారు. బై బై పాకిస్థాన్ అని పెద్దగా రాసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో వీరూ పోస్ట్ చేశారు. ఇండియాలో ఆతిథ్యం, బిర్యానీని పాకిస్థాన్ టీమ్ ఎంజాయ్ చేసిందని ఆశిస్తున్నట్టు రాసుకొచ్చారు. ఇక స్వదేశానికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉండడని.. పాకిస్థాన్ జిందాభాగ్ అంటూ సెహ్వాగ్ క్యాప్షన్ పెట్టారు.
“పాకిస్థాన్ జిందాభాగ్! ఇక ఇంతే. మీరు బిర్యానీని, అతిథ్యాన్ని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నా. విమానంలో ఇంటికి క్షేమంగా వెళ్లండి. బై బై పాకిస్థాన్!” అని సెహ్వాగ్ ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్ పోస్ట్ చేశారు.
హైదరాబాద్, కోల్కతాల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తెగ బిర్యానీలు తినేశారు. అందుకే బిర్యానీ అంటూ ఆ టీమ్కు పంచ్ వేశారు వీరూ.
అలాగే, పాకిస్థాన్కు మద్దతుగా ఆడే ఇతర జట్టు కూడా.. ఆ టీమ్లాగే ఆడుతుందని సెహ్వాగ్ చమత్కరిస్తూ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక చిత్తుగా ఓడడం గురించి ఇలా రాసుకొచ్చారు. చివర్లో సారీ శ్రీలంక అని పేర్కొన్నారు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య రేపు (నవంబర్ 11)న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటికే పేలవమైన ఆటతో సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. పాకిస్థాన్కు కూడా దాదాపు సెమీస్ అవకాశాలు లేవు. అయితే, ఇంగ్లండ్తో మ్యాచ్లో ఏదైనా జరగవచ్చనే ఆశాభావాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఒక వికెట్ తేడాతో ఓడిన మ్యాచే టోర్నీలో తమను బాగా దెబ్బ తీసిందని చెప్పాడు.
వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో గెలిచి సెమీస్కు చేరింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది. నాలుగో స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకున్న న్యూజిలాండ్తో సెమీస్లో భారత్ తలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరో సెమీస్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి.