Smriti Mandhana The Goddess: స్మృతి మంధానా ఓ దేవత: ఆమె కోసం 1200 కి.మీ. ప్రయాణించిన చైనా అభిమాని
26 September 2023, 14:47 IST
- Smriti Mandhana The Goddess: స్మృతి మంధానా ఓ దేవత అంటూ ఆమె కోసం 1200 కి.మీ. ప్రయాణించాడు ఓ చైనా అభిమాని. బీజింగ్ నుంచి ఆమె ఆడిన హాంగ్జౌ వరకూ వెళ్లడం విశేషం.
స్మృతి మంధాని ది గాడెస్ అనే ప్లకార్డుతో చైనాలోని అభిమాని జున్ యు
Smriti Mandhana The Goddess: స్మృతి మంధానా.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ వైస్ కెప్టెన్. ఓపెనింగ్ బ్యాటర్. మంచి ప్లేయరే కాదు.. తన అందంతోనూ అభిమానులను సంపాదించుందామె. స్మృతికి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే చైనాలో మాత్రం ఆమెకు ఓ వీరాభిమాని ఉండటం విశేషం.
స్మృతి మంధానా ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడటానికి ఆ అభిమాని ఏకంగా 1200 కి.మీ. ప్రయాణించాడు. చైనాలోని హాంగ్జౌలో ప్రస్తుతం ఏషియన్ గేమ్స్ జరుగుతున్న విషయం తెలుసు కదా. ఈ గేమ్స్ లో ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచింది. ఫైనల్లో శ్రీలంకను 19 పరుగులతో చిత్తు చేసి తొలి గోల్డ్ మెడల్ తో చరిత్ర సృష్టించింది.
ఈ ఫైనల్ మ్యాచ్ చూడటానికి జున్ యు అనే వ్యక్తి బీజింగ్ నుంచి హాంగ్జౌ వచ్చాడు. ఈ రెండు నగరాల మధ్య దూరం 1200 కి.మీ. స్మృతి మంధానా కోసం ఇండియాలో అభిమానులు ఇంత దూరం ప్రయాణిస్తే పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ క్రికెట్ అంటే పెద్దగా పరిచయం లేని చైనాలో ఓ ఇండియన్ వుమన్ ప్లేయర్ కు ఈ స్థాయిలో ఓ అభిమాని ఉండటం విశేషమే.
స్మృతి మంధానా.. ది గాడెస్
అంతేకాదు సదరు అభిమాని స్మృతిని ఓ దేవతలా ఆరాధిస్తున్నాడు. స్మృతి మంధానా ది గాడెస్ అనే ఓ ప్లకార్డు పట్టుకొని అతడు ఈ మ్యాచ్ కు రావడం విశేషం. ఈ సందర్భంగా కెమెరాల దృష్టిని అతడు ఆకర్షించాడు. పీటీఐ రిపోర్టర్ సదరు అభిమానితో మాట్లాడింది. ఈ సందర్భంగా తాను స్మృతి మంధానాకే కాదు.. సచిన్, కోహ్లిలకు కూడా అభిమానినే అని చెప్పడం విశేషం.
"2019 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై జస్ప్రీత్ బుమ్రా స్పెల్ చూశాను. నేను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని కూడా ఫాలో అవుతాను. ప్రస్తుతం క్రికెట్లో వాళ్లు గ్రేట్ ప్లేయర్స్. సూర్యకుమార్ యాదవ్, బుమ్రా కూడా గొప్పోళ్లే. 2019 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్ అద్భుతం" అని జున్ యు అన్నాడు. తాను బీజింగ్ లోని తన యూనివర్సిటీ నుంచి క్రికెట్ పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పాడు.
చైనాలో క్రికెట్ ఎవరికీ తెలియదని, గువాన్గ్జౌలో మాత్రమే ఓ శాశ్వత క్రికెట్ స్టేడియం ఉన్నదని జున్ యు చెప్పాడు. ఇండియన్ క్రికెటర్లను తాను ఎంతగానో ఆరాధించినా.. తన ఫేవరెట్ క్రికెటర్ మాత్రం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అని జున్ చెప్పడం విశేషం. ఇక ఇండియన్ టీమ్ ఆడుతుంటే చూడటానికి తాను 1000 యువాన్లు (సుమారు రూ.11400) ఖర్చు చేసి బీజింగ్ నుంచి హాంగ్జౌ వచ్చినట్లు కూడా తెలిపాడు.