IND vs AUS: కామెంటరీలో హేడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
04 December 2023, 16:36 IST
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 జరుగుతున్న సమయంలో కామెంటరీ చేసిన ఆసీస్ మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్.. అంపైర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలివే..
IND vs AUS: కామెంటరీలో హేడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు (Photo: Twitter)
IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఆదివారం (డిసెంబర్ 3) జరిగిన ఐదో టీ20లో ఉత్కంఠ పోరులో భారత్ గెలిచింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 160 పరుగులను కాపాడుకొని భారత్ విజయం సాధించింది. డెత్ ఓవర్లలో భారత పేసర్లు ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా, చివరి ఓవర్లో ఆస్ట్రేలియాకు విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. అర్షదీప్ కేవలం 3 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు.
అయితే, అర్షదీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో అంపైర్ విషయంలో కాస్త అసంతృప్తి రేగింది. ఆ సమయంలో కామెంటరీ చేస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యు హేడెన్ వివాదాస్పద కామెంట్లు చేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వనప్పుడు, బంతి అంపైర్ను తగిలినప్పుడు వ్యాఖ్యలు చేశాడు.
చివరి ఓవర్ తొలి బంతిని ఆసీస్ బ్యాటర్ మాథ్యు వేడ్ ఎదుర్కొన్నాడు. అర్షదీప్ బౌన్సర్ వేశాడు. ఆ బంతి వేడ్ తలపై నుంచి వెళ్లింది. అయితే, స్క్వేర్ లెగ్ అంపైర్ దాన్ని వైడ్గా ఇవ్వలేదు. దీంతో వేడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు “ఆ అసంతృప్తిని మీరు చూడొచ్చు. అది కచ్చితంగా వైడ్. అది తలపై నుంచి వెళ్లింది. అతడు క్రీజులోనే నిలబడినా ఆ బంతి తలపై నుంచే వెళ్లింది” అని హేడెన్ అన్నాడు.
అదే ఓవర్లో ఐదో బంతిని నాథన్ ఎలిస్ స్ట్రైట్గా కొట్టాడు. అయితే, ఆ బంతి అర్షదీప్ సింగ్ కుడి చేతిని తాకి.. ఆ తర్వాత మెయిన్ అంపైర్ వీరేందర్ శర్మకు తగిలింది. దీంతో బంతి అక్కడే పడింది. బంతిని తప్పించుకునేందుకు అంపైర్ పక్కకి జరిగినా.. అర్షదీప్ చేయి తగలడంతో అది ఆయన వైపే వెళ్లింది. ఆస్ట్రేలియాకు అదృష్టం కలిసి రాలేదు. అయితే, ఈ విషయంపై హేడెన్ వివాదాస్పద కామెంట్ చేశాడు. “ఈ ఓవర్లో అంపైర్ రెండోసారి తన పని చేశారు. దీన్ని చూడండి. ఇప్పుడు స్క్వేర్ నుంచి కాదు.. ఫ్రంట్ అంపైర్. వారిద్దరూ పోటీ పడుతున్నారు” అని హేడెన్ అన్నాడు.
అయితే, అంపైర్ శర్మ బంతిని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. సాధారణంగా అయితే అది ఆయన తగిలేది కాదు. అయితే, అర్షదీప్ చేతిని తాకడంతో అది ఆయన వద్దకు వెళ్లింది. దీంట్లో అంపైర్ కావాలని చేసినట్టు ఏ మాత్రం కూడా లేదు. అయితే, హేడెన్ మాత్రం అంపైర్ ఉద్దేశపూర్వకంగానే బంతిని ఆపారనేలా కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాథ్యూ హేడెన్ చేసిన కామెంట్లు తమకు నచ్చలేదని చాలా మంది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హేడెన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అసంతృప్తి చెందుతున్నారు. “కామెంటేటర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దారుణం.. అది అంపైర్కు తగలకపోయినా రెండు పరుగులే వచ్చేవి. అది పెద్ద తేడా అయ్యేది కాదు” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఆసీస్ రెండు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. ఎలిస్ కొట్టిన బంతి అంపైర్కు తగలడంతో ఒక రన్ వచ్చింది. మొత్తంగా కామెంటరీ బాక్సులో ఉంటూ అంపైర్లపై హేడెన్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.