India vs Pakistan Semifinal: ఇండియా, పాకిస్థాన్ సెమీఫైనల్ సాధ్యమేనా? ఇలా జరిగితే..
05 November 2023, 15:21 IST
- India vs Pakistan Semifinal: ఇండియా, పాకిస్థాన్ సెమీఫైనల్ సాధ్యమేనా? వరల్డ్ కప్ 2023లో మరోసారి దాయాదుల సమరంపై అభిమానుల్లో ఆశలు రేగుతున్నాయి. కాస్త కష్టమే అయినా.. అది సాధ్యమే అనిపిస్తోంది.
వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడే అవకాశం
India vs Pakistan Semifinal: వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడతాయా? వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడి.. వరల్డ్ కప్ నుంచి లీగ్ స్టేజ్ లోనే బయటకు వెళ్లిపోయేలా కనిపించిన పాక్ టీమ్.. వరుసగా రెండు విజయాలతో మళ్లీ సెమీస్ రేసులో నిలిచింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లపై విజయాలతో పాక్ ఇప్పుడు సెమీస్ బెర్త్ పై కన్నేసింది.
బెంగళూరులో న్యూజిలాండ్ పై అనూహ్యంగా గెలిచింది పాకిస్థాన్. ఫఖర్ జమాన్ మెరుపు సెంచరీతోపాటు వర్షం కూడా పాక్ విజయానికి దోహదం చేసింది. పాక్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మరోసారి ఇండియా, పాకిస్థాన్ ఈ టోర్నీలో ఆడతాయన్న ఆశ అభిమానుల్లో పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే అది జరగాలంటే కొన్ని సమీకరణాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో పాక్ ఐదో స్థానంలో ఉంది.
ఇండియా, పాకిస్థాన్ సెమీఫైనల్ ఇలా సాధ్యం
ఇండియా, పాకిస్థాన్ సెమీఫైనల్లో తలపడాలంటే ఇలా జరగాలి.
- పాకిస్థాన్ తాను ఇంగ్లండ్ తో ఆడబోయే చివరి మ్యాచ్ లో ఎంతో మెరుగైన మార్జిన్ తో కచ్చితంగా గెలవాలి. దీని వల్ల ఆ టీమ్ 10 పాయింట్లు, మంచి నెట్ రన్ రేట్ సాదిస్తుంది.
- అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడబోయే రెండు మ్యాచ్ లలోనూ కచ్చితంగా ఓడిపోవాలి. అలా అయితే ఆ టీమ్ 8 పాయింట్లతోనే ముగిస్తుంది.
- శ్రీలంక చేతుల్లో న్యూజిలాండ్ కచ్చితంగా ఓడిపోవాలి. అలా అయితే న్యూజిలాండ్ 8 పాయింట్లతోనే ఉంటుంది. పాకిస్థాన్ తో పోలిస్తే న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ బాగుంది. అందువల్ల లంకపై కివీస్ గెలిస్తే.. పాకిస్థాన్ భారీ మార్జిన్ తో ఇంగ్లండ్ ను ఓడించాల్సిన పరిస్థితి వస్తుంది.
- ఇండియా తన చివరి రెండు మ్యాచ్ లు సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ పై గెలిచి టేబుల్లో టాప్ లో ఉండాలి.
- ఇవన్నీ జరిగితే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్స్ రెండు, మూడు స్థానాల్లో ఉండే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్ నాలుగో స్థానంలో సెమీఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
లీగ్ స్టేజ్ లో పాయింట్ల టేబుల్లో 1, 4 స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఒక సెమీఫైనల్లో, 2, 3 స్థానాల్లో నిలిచిన టీమ్స్ మరో సెమీఫైనల్లో తలపడతాయి. ఆ లెక్కన ఇండియా, పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే చాలా అడ్డంకులు ఉన్నా.. ఆ అవకాశమైతే ఉంది. దీంతో దాయాదుల సెమీస్ చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
టాపిక్