Budget 2024: మధ్యతరగతి ప్రజల కోసం గృహనిర్మాణ పథకం; పీఎంఏవై కింద మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం
01 February 2024, 12:46 IST
housing scheme for middle class: దేశంలో సొంత ఇళ్లు లేని పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనుంది. దేశం ఎదుర్కొంటున్న మొత్తం గృహ కొరతను పూడ్చడానికి ఇది గణనీయంగా సహాయపడుతుందని భావిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
మధ్యతరగతి ప్రజలు సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించడానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న తన బడ్జెట్ 2024 (budget 2024) ప్రసంగంలో చెప్పారు. మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇళ్లు కొనుక్కోవడానికి లేదా నిర్మించుకోవడానికి వీలుగా ప్రభుత్వం నూతన గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
పీఎంఏవై గ్రామీణం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని సాధించడానికి దగ్గరగా ఉందని, పిఎమ్ఎవై (గ్రామీణ) కింద వచ్చే ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
అందరికీ పక్కా ఇల్లు
పీఎం ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో మరో రూ.2 కోట్ల గృహ నిర్మాణాలు చేపడ్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అద్దె ఇళ్లల్లో, మురికి వాడల్లో, రేకుల ఇళ్లు, గుడిసెల్లో నివసిస్తున్నవారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదా కొనుగోలు చేయడానికి కొత్త హౌసింగ్ స్కీమ్ ఉపయోగపడుతుంది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని కచ్చా ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారందరికీ మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా ఇంటిని అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది.