FASTags : అలర్ట్.. ఏప్రిల్ నుంచి మీ ఫాస్టాగ్స్ పని చేయవు! కారణం ఇదే..
09 February 2024, 11:10 IST
- GPS toll collection system : ఏప్రిల్ నుంచి ఫాస్టాగ్స్ పనిచేయకపోవచ్చు. ఇందుకు ఓ కారణం ఉంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ని ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తుండటం ఇందుకు కారణం!
అలర్ట్.. ఏప్రిల్ నుంచి మీ ఫాస్టాగ్స్ పని చేయవు! కారణం ఇదే..
What is GPS toll collection system : దేశంలో ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్ని తీసుకురావాలని.. కేంద్రం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన మాటలు వింటుంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఫాస్టాగ్స్ పని చేయవు అన్న సూచనలు కనిపిస్తున్నాయి!
ఏప్రిల్ నుంచి ఫాస్టాగ్స్ పని చేయవా?
ఇంకొన్ని నెలల్లో దేశంలో 2024 లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే ముందు.. దేశవ్యాప్తంగా జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. అంటే.. ఈ కొత్త వ్యవస్థ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. కేంద్రం ఇప్పటికే ఓ కన్సల్టెంట్ని కూడా నియమించినట్టు వివరించారు.
FASTags removal in India : ఫాస్టాగ్ వ్యవస్థ కూడా పాతదేమీ కాదు. 2021లో.. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనాలు.. డబుల్ టోల్ కట్టాలని చెప్పుకొచ్చింది. అయితే.. జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్ని అమలు చేసి, ఫాస్టాగ్ వ్యవస్థని దశల వారీగా తొలగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
ఈ కొత్త వ్యవస్థలో.. ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ఉంటుంది. హైవేలపై కెమెరాలు అమర్చి ఉంటాయి. వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి.. టోల్ కట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్లు.. ఆర్ఎఫ్ఐడీ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ని ఫాలో అవుతున్నాయి.
GPS toll collection system India : వాస్తవానికి.. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ని ఈ ఏడాది మార్చ్ నాటికి అమలు చేయాలని చూస్తున్నట్టు నితిన్ గడ్కరీ గతేడాది చెప్పారు.
"టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీపీఎస్ ఆధారిత్ టోల్ సిస్టెమ్ని తీసుకురావాలని చూస్తున్నాము. ఇది శాటిలైట్తో ముడిపడిన విషయం. మార్చ్ నాటకి అమలు చేయాలని చూస్తున్నాము," అని నితన్ గడ్కరీ ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు.. ఇది ఏప్రిల్లో అమలవుతుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి.. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పలు జాతీయ రాహదారులపై అమలు చేసింది ప్రభుత్వం. టెస్ట్ రన్ ముగిసిన తర్వాత.. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది.
జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ ఎలా పనిచేస్తుంది?
GPS toll collection system process : వెహికిల్ నెంబర్ ప్లేట్ని.. రహదారులపై ఉన్న కెమెరాలు స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత.. టోల్ ఛార్జీలు కట్ అవుతాయి. నెంబర్ ప్లేట్స్ అనేవి.. టోల్ ఛార్జీలు వసూలు చేసే అకౌంట్స్కి లింక్ అయ్యి ఉంటాయి. ఇందులో ఉండే ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ చాలా కీలకం.
ఒకప్పుడు.. టోల్స్ని వసూలు చేయడం కోసం టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సి వచ్చేది. డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వెనుక లైన్ చాలా పెరిగిపోయేదు. రద్దీని తగ్గించేందుకే ఫాస్టాగ్స్ సిస్టెమ్ని ప్రవేశపెట్టారు. వాహనానికి యటాచ్ అయ్యి ఉండే ఫాస్టాగ్ని టోల్ ప్లాజాల వద్ద స్కాన్ చేస్తారు. డబ్బులు కట్ అవుతాయి. 2018-19 లో టోల్ ప్లాజాల వద్ద 8 నిమిషాలుగా ఉన్న వెయిటింగ్ టైమ్.. ఫాస్టాగ్స్ వల్ల 47 సెకన్లకు దిగొచ్చింది.
ఇక ఇప్పుడు.. జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ కలెక్షన్ వ్యవస్థ అమల్లోకి వస్తే.. అసలు టోల్ ప్లాజా అవసరమే ఉండదని తెలుస్తోంది. హైవేలపై ఉండే కెమెరాల ద్వారానే.. టోల్ కట్ అవుతుంది!
అయితే.. ఏప్రిల్ నుంచే ఈ కొత్త సిస్టెమ్ అమల్లోకి వస్తుందా? లేదా ఇంకా సమయం పడుతుందా? అనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పాల్సి ఉంది.