Budget 2022 | ‘చూడటానికి స్టైల్గా ఉన్నా.. ఈ బడ్జెట్లో ఏం లేదు’
01 February 2022, 19:12 IST
- YCP on budget 2022 | కేంద్ర బడ్జెట్ అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. బడ్జెట్.. బయట చూడటానికి స్టైల్గా ఉందని, కానీ లోపల ఏం లేదని మండిపడ్డారు.
విజయసాయి రెడ్డి
Union budget 2022 |కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపర్చిందని, చాలా విషయాలపై అసలు ప్రస్తావనే లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. చూడటానికి స్టైల్గా ఉన్నా, అందులో ఏమీ లేదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్ కా వికాస్ అస్సలే లేదని, రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఏ మాత్రం లేదని మండిపడ్డారు.
ఢిల్లీలోని ఏపీ భవన్లో.. వైసీపీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు విజయసాయి రెడ్డి. టీడీపీ హయాంలో పరిమితికి మించి రుణాల సేకరిస్తే, వాటికి ఇప్పుడు కోత విధించడం సరి కాదన్నారు.
"కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉంది. రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి కేవలం రూ.4 వేల కోట్లే వస్తాయి. వెంటనే ఆ ఫార్ములాను సవరించాలి. రాష్ట్ర వాటా పెంచాలి. గత ఏడాది ఏపీకి వచ్చింది కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఉత్తరప్రదేశ్కు ఏకంగా రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చారు. ఆ స్థాయిలో వ్యత్యాసం ఉంది. వెంటనే దీన్ని సవరించాలి," అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఇక గోదావరి- కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-ావేరి నదుల అనుసంధానం నిర్ణయం అభినందనీయమని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేసిందని తెలిపారు. మరోవైపు కృష్ణా–పెన్నా అనుసంధానంలో కూడా కొంత పని జరిగిందని వివరించారు. కాబట్టి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను కేంద్రం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు..
నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని కేంద్రం చెప్పడంతో టీడీపీకి ప్రయోజనం చేకూరుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయి రెడ్డి. ఆ పార్టీలో చాలా మందికి మెంటల్ సమస్యలు ఉన్నాయని, కేంద్రం చెప్పిన దాన్ని వారు వినియోగించుకోవాలని ఎద్దేవా చేశారు.
ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టలేదేంటి?
ఆరోగ్య రంగానికి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్లో వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టలేదని విమర్శించారు వైసీపీ నేత. ఆర్ అండ్ డీ ప్రస్తావన అసలే రాకపోవడం చింతించే విషయమన్నారు. ఫార్మా రంగంలో గత ఏడాది చైనా నుంచి దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్నామని, కాబట్టి ఇప్పటికైనా ఫార్మా రంగంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందిని పేర్కొన్నారు.
'వీటి ప్రస్తావన లేదు'
"నరేగాలో కవరేజ్ ఏ మాత్రం పెంచలేదు. కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఏ ప్రకటనా లేదు. పీఎం కిసాన్ పథకంలో భూమిలేని రైతులను పూర్తిగా వదిలేశారు. కాబట్టి వారికి ఒక పథకం వర్తింపచేయాలి. కనీస మద్దతు ధరకు చటబద్దత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు. ఏదో ఉన్నా అది క్లియర్గా లేదు. కాబట్టి వెంటనే దాన్ని రూపొందించాలి," అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.
'ప్రైవేటీకరణ వద్దు'
విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మవద్దని పదే పదే చెబుతున్నామని చెప్పారు విజయసాయి రెడ్డి. ఎల్ఐసీ, హెచ్పీసీఎల్ వంటి లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. విశాఖ ఉక్కు కంపెనీ కూడా లాభాల్లో ఉంది కాబట్టి, అమ్మవద్దని కోరుతున్నట్టు స్పష్టం చేశారు.