MP Vijayasai Reddy On CBN : రక్తపాతమే లక్ష్యంగా చంద్రబాబు కుట్ర
06 August 2023, 8:35 IST
- YCP MP Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రక్తపాతమే లక్ష్యంగా చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. చంద్రబాబును అవకాశవాదిగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తిస్తున్నారంటూ విమర్శించారు.
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్
MP Vijaya Sai Reddy On Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి లాభపడాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రాజెక్టుల పరిశీలన ముసుగులో భారీ కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ టార్గెట్ గా ట్విటర్ వేదికగా వరుస పోస్టులు చేశారు ఎంపీ విజయసాయి. సొంత పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి, గొడవలతో లబ్ధి పొందాలనే వ్యూహరచన చంద్రబాబు దిగజారుడు తనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. బీరు సీసాలు, కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేయించాడని చెప్పారని... చంద్రబాబు సృష్టించిన అల్లర్లలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు రెండు పోలీసు వాహనాలను తగులబెట్టాయని విమర్శించారు. 27 మంది పోలీసులు అలాగే 50 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.
రాయలసీమ, కోస్తాంధ్ర చివరకు ఆయన నివాసం ఉంటున్న హైదరాబాద్ వాసులు కూడా చంద్రబాబును మనిషిగా భావించడంలేదన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తమకు ద్రోహం చేసిన ‘అవకాశవాది' గానే అందరూ భావిస్తున్నారని చెప్పారు. ఆయన వ్యాపారాల కోసం, అతని సన్నిహితుల సమూహం కోసమే అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రయాస పడి, ఇప్పుడు కబుర్లు చెబితే ప్రజలు నమ్మరనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. "తొడేళ్లు, నక్కలు ఎప్పుడూ సింహంగా మారినట్టు కలలు కంటూ సింహంలా గర్జించాలని చూస్తాయి. అయితే జన్మత: వచ్చిన ఊళ ఎంత ప్రయత్నించినా పోదు. అలాగే విపక్షనేత చంద్రబాబు కూడా సింహంలా మారాలని ఆశపడుతున్నాడని అయితే 14 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడే కాలేకపోయాడని, ఇప్పుడు కొత్తగా సింహం ఎలా అవుతాడు" అని మరో ట్వీట్ లో ప్రశ్నించారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసైన్డ్ భూములపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించిందని విజయసాయిరెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు కేటాయించి 20 ఏళ్లు పూర్తయిన భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. 1954 నుంచి 2003 లోపు ఇచ్చిన భూములు 28 లక్షల ఎకరాలకుపైనే ఉన్నాయని అన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించి పదేళ్లు దాటిన లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించిందని వెల్లడించారు. టీడీపీ మద్దతుతో మరో చిట్ఫండ్ కుంభకోణాన్ని భరించేందుకు ఆంధ్రా ప్రజలు సిద్ధంగా లేరన్న విజయసాయిరెడ్డి,,,, మార్గదర్శి చిట్ఫండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు కంపు కొడుతున్నాయని ట్వీచ్ చేశారు.