Visakha Lands: విజయసాయిరెడ్డి కామెంట్స్.. సొంత పార్టీ ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్!-ycp mp mvv satyanarayana serious comments on mp vijaysaireddy over lands issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Lands: విజయసాయిరెడ్డి కామెంట్స్.. సొంత పార్టీ ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్!

Visakha Lands: విజయసాయిరెడ్డి కామెంట్స్.. సొంత పార్టీ ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్!

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 10:46 AM IST

mp vijayasai Vs mp mvvv: విశాఖ నడిబొడ్డున ఉన్న భూములు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా... ఈ వ్యవహరం మరో టర్న్ తీసుకుంది. ఈసారి సొంత పార్టీ అయిన ఎంవీవీ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయన్న చర్చ మొదలైంది.

వైసీపీ ఎంపీ డైలాగ్ వార్..!
వైసీపీ ఎంపీ డైలాగ్ వార్..! (HT)

MP MVV Satyanarayana Comments On MP Vijaysai: వేల కోట్ల విలువ చేసే భూములు...! దశాబ్ధాలుగా వివాదం అలాగే కొనసాగుతోంది. కోర్టు తీర్పులు, ప్రభుత్వ చర్యలు ఇలా సాగిపోయింది. నాడు టీడీపీ అధికారంలో ఉండగా కొందరు నేతలపై వైసీపీ ఆరోపణలు... ఇప్పుడు వైసీపీ నేతలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఓ ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నగరంలో చేపడుతున్న ప్రాజెక్ట్ గురించి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ చేపడుతున్న వ్యక్తి కూడా అధికార పార్టీ ఎంపీనే...! సరిగ్గా ఈ పరిణామామే అధికార పార్టీలో(వైసీపీ) డైలాగ్ వార్ కు దారి తీసింది. దీంతో విశాఖ భూముల ముచ్చట టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారిపోయింది.

ఎంపీ విజయసాయి వర్సెస్ ఎంపీ ఎంవీవీ!

'విశాఖలోని కూర్మన్నపాలెంలో భూమి యజమానికి ఒక శాతం ఇచ్చి, ప్రాజెక్టు డెవలపర్‌ 99% తీసుకున్నారని, ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నాం' ఇది రెండు రోజుల కిందట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. ఈ ప్రాజెక్టు స్థానిక వైసీపీ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణది. అంతేకాదు హయగ్రీవ ప్రాజెక్టుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. దీనిలో కూడా ఎంపీ ఎంవీవీ కూడా భాగస్వామిగా ఉన్నారు. కూర్మన్నపాలెం ప్రాజెక్టు గురించి విజయసాయిరెడ్డి తనంతట తానే ప్రస్తావించడం రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలు, ఆధిపత్యపోరుకి సాయిరెడ్డి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంతలోనే ఎంపీ ఎంవీవీ కూడా తనదైన శైలిలో స్పందించారు. డెక్కన్ క్రానికల్ (ఆంగ్ల పత్రిక)కు ఇంటర్వూ ఇచ్చిన ఆయన... ఎంపీ విజయసాయిరెడ్డిని సూటిగా పలు అంశాలపై ప్రశ్నించారు. ఇతరుల గురించి మాట్లాడేముందు మొదట తనకు అంటిని మురికిని కడుకోవాలంటూ సెటైర్లు విసిరారు.

తాను రాజకీయాల్లోకి రాకముందే నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను అని స్పష్టం చేశారు. ఎంపీ ప్రస్తావించిన ప్రాజెక్ట్ పై స్పందించిన ఎంపీ ఎంవీవీ... హక్కుదారులు చాలా మంది తనని సంప్రదించారని... తాను ఎంపీగా లేనప్పుడు అంటే 2017లోనే పరస్పర అంగీకారంతో ఆ సమస్య పరిష్కరించుకున్నామని స్పష్టం చేశారు.

daspalla lands issue: ఎంపీ విజయసాయి దసపల్లా భూముల ఒప్పందాన్ని అంగీకరించినప్పడు... ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే నిర్ణయం వర్తిస్తుందనే విషయాన్ని గుర్తించాలని చెప్పుకొచ్చారు. ఆయనలా (ఎంపీ విజయసాయిరెడ్డి) కాకుండా... తన ప్రైవేటు భూమిలో ప్రాజెక్ట్ చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించలేదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు.

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి కుమార్తె నగరంలో కొన్న భూమలు అంశాన్ని కూడా ప్రస్తావించారు ఎంపీ ఎంవీవీ. గెస్ట్ హౌస్ లో కూర్చొని ఆయన మనుషులు భూములు ఎలా తీసుకుంటున్నారో అందరికీ తెలుసంటూ కామెంట్స్ చేశారు. ఆ భూముల్లో కొన్ని డీ- పట్టాతో పాటు 22 ఏ జాబితాలోనూ ఉన్నాయని పేర్కొన్నారు.

తాను ఆత్మగౌరవంతో బతికే వ్యక్తినని... ఎవరికి గులాంగిరి చేయలేనని ఎంపీ ఎంవీవీ స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల గురించి మీడియాలో వచ్చిన కథనాలకు తానే కారణమని ఆయన భావిస్తున్నారని తెలిపారు. అయితే ఇలాంటి చౌకబారు రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు ఎంవీవీ.

మొత్తంగా ఇద్దరి మధ్య విబేధాలతో తారాస్థాయికే చేరాయనే చర్చ నడుస్తోంది. అయితే దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఎంపీ ఎంవీవీని కూడా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నారు. భూయజమానులకు కేవలం 0.96 శాతం వాటా ఇచ్చి.. తాను 99.04 శాతం వాటా తీసుకునేలా ఎంపీ కుదుర్చుకున్న ఒప్పందం వెలుగుచూడటంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి అద్భుతాలన్నీ వైసీపీ ప్రజాప్రతినిధులకు, వారి సన్నిహితులకే సాధ్యమవుతాయంటూ దుయ్యబడుతున్నారు. వైసీపీ నేతల అరాచకాలకు.. ఈ ఒప్పందం పరాకాష్ఠగా నిలిచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం