MP Vijay Sai Reddy : దృష్టంతా 'బావ'సారూప్య పార్టీ వైపే - పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
12 November 2023, 13:19 IST
- YCP MP Vijay Sai Reddy vs Purandeswari : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో పురందేశ్వరి ఉన్నారంటూ సెటైర్లు విసిరారు.
విజయసాయిరెడ్డి వర్సెస్ పురందేశ్వరి
Vijaya Sai Reddy Vs Purandeswari : గత కొంతకాలంగా పురందేశ్వరి వర్సెస్ వైసీపీ అన్నట్టు మధ్య మాటల యుద్దం సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ నాటి నుంచి పురందేశ్వరిపై విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి… తాజాగా లిక్కర్ కేసు వ్యవహరంలోనూ ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటున్నారు. ఇటీవలే ఏకంగా సీజేఐకి కూడా లేఖ రాశారు పురందేశ్వరి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీంతో వీరి మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరింది.
ఇక మరోసారి లిక్కర్ కేసు అంశాన్ని ప్రస్తావించారు ఎంపీ విజయసాయిరెడ్డి. “చంద్రబాబు గారు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగానే 'X'(ట్విట్టర్) లో మరో పోస్టు చేశారు. “పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే. పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే” అంటూ సెటైర్లు విసిరారు.