VSR Targets Purandeswari: టార్గెట్ పురందేశ్వరి వెనుక స్కెచ్ ఏమిటి?
08 November 2023, 12:28 IST
VSR Targets Purandeswari: వైసీపీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై నిప్పులు చెరుగుతున్నారు. వరుస ట్వీట్లతో పురందేశ్వరిని టార్గెట్ చేశారు. సాయిరెడ్డి కోపం, ఆవేశం వెనుక కారణమేమిటనే చర్చ జరుగుతోంది.
సాయిరెడ్డి వర్సెస్ పురందేశ్వరి
VSR Targets Purandeswari: వైసీపీ ముఖ్య నాయకుడు సాయిరెడ్డికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీజేపీ అగ్రనేతలతో అత్యంత సన్నిహితంగా మెలిగే సాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలి విషయంలో మాత్రం భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు బీజేపీతో వైసీపీ దోస్తీ అనుకునే ప్రచారాలకు భిన్నంగా పురందేశ్వరిపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలతో చెలరేగిపోతున్నారు. సాయిరెడ్డి ఆవేశానికి కారణం ఏమిటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.
బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు మునుపటి మాదిరి లేవు. పురందేశ్వరి టీడీపీ మనిషి అంటూ వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. కొద్ది రోజుల క్రితం సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా పురందేశ్వరి చీఫ్ జస్టిస్కు లేఖలు రాశారు. అంతకు ముందు ఏపీలో మద్యం నాణ్యత, అమ్మకాలపై ఆమె విమర్శలు చేశారు.
ఏపీ లిక్కర్ పాలసీపై పురందేశ్వరి ప్రశ్నించినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అప్పులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆడిట్ చేయించాలని పురందేశ్వరి లేఖలు రాసినపుడు పెద్దగా వైసీపీ నుంచి స్పందన రాలేదు.
లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని పురందేశ్వరి ఆరోపిస్తూ సాయిరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దీనిని ఆయన ఖండించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్,రిమాండ్ పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్, పురందేశ్వరి, కిషన్ రెడ్డిలతో కలిసి అమిత్షాతో భేటీ అయ్యారు. ఏపీలో టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు పురందేశ్వరి రాయబారాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
ఈ విమర్శలు కాస్త వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లాయి. సాయిరెడ్డి, సిఎం జగన్ 11ఏళ్లుగా బెయిల్పై ఉన్నారని, వారిపై నమోదైన కేసుల విచారణ చేపట్టాలంటూ పురందేశ్వరి లేఖలు రాయడంతో సాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇది కాస్త నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజులుగా ట్విట్టర్ వేదికగా పురందేశ్వరిపై ఎంపీ సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
దేశానికి,రాష్ట్రానికి చేసిందేమీ లేదు…
డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విజయసాయిరెడ్డి తాజాగా ఆరోపించారు. పురందేశ్వరీ....ఎన్టీఆర్ ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదని విమర్శించారు.
73 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్కు తిండిపెట్టకుండా, నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి కిందికి లాగిపడేశారని దుయ్యబట్టారు. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా ! అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు..
పురందేశ్వరి ఎప్పుడూ కులం, కుటుంబం చుట్టే రాజకీయాలు చేస్తారని అన్నారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే, మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దరణే". మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవని సాయిరెడ్డి మండిపడ్డారు.
పురంధేశ్వరి ఒకసారి పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి మళ్లీ బరిలోకి దిగరని చెప్పారు. ప్రజల మనోభావాలను పట్టించుకోరని, కాబట్టి రెండోసారి గెలిచే సీన్ లేదన్నారు. కాంగ్రెస్ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో వైఎస్సార్ హవాలో బయటపడ్డారని, బిజెపిలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి లక్షా 75 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని ఆరోపించారు. 2009లో వైఎస్సార్ చలవతో గెలిస్తే 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తే వచ్చిన ఓట్లు కేవలం 2.73% మాత్రమేనని ఎద్దేవా చేశారు.
డైవర్షన్ కోసమేనంటున్న పురందేశ్వరి….
సాయిరెడ్డి ఆరోపణలు, ట్వీట్లు తాజా సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమేనని పురందేశ్వరి చెబుతున్నారు. ప్రతి ట్వీట్కు తాను స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు.
మరోవైపు పురందేశ్వరి-సాయిరెడ్డిల ఎపిసోడ్లో మిగిలిన వైసీపీ నాయకులు ఎవరు పెద్దగా స్పందించడం లేదు. ఏపీ ప్రభుత్వ తీరుపై పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలు, కేసుల విచారణ వెంటనే చేపట్టాలంటూ సీజేకు లేఖలు రాయడం వంటి అంశాలపై సాయిరెడ్డి ఒక్కరే ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు.
పురందేశ్వరి వ్యవహారంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రాలేదో, తమకెందుకనుకున్నారో కాని ఆ పార్టీ నేతలెవరు పెదవి విప్పడం లేదు. అటు బీజేపీలో కూడా ప్రభుత్వంపై పోరాటం, విమర్శల ఎపిసోడ్లో పురందేశ్వరి ఒంటరైనట్టు కనిపిస్తోంది.