TTD Srivani Trust : శ్రీవాణ ట్రస్టుపై ఆరోపణలు.. నిజనిర్ధారణ కమిటీకి టీటీడీ అనుమతి
02 August 2023, 14:31 IST
- TTD Srivani Trust Latest News: శ్రీవాణి ట్రస్టుపై మీడియా ప్రతినిధుల నిజనిర్ధారణ కమిటీకి టీటీడీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవాణి ట్రస్టు
TTD Srivani Trust News: శ్రీవాణి ట్రస్టుపై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిని ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు ఖండిస్తున్నప్పటికీ... విమర్శలు, ఆరోపణలు మాత్రం ఆగటం లేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి ఏర్పాటైన తిరుపతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటీకి టీటీడీ అనుమతించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
శ్రీవాణి ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాతన ఆలయాల జీర్ణోద్ధరణతోపాటు ఎస్సి, ఎస్టి, బిసీ, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం కూడా చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టుపై ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై ఆరోపణలు చేస్తుండడంతో ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి తిరుపతి ప్రెస్క్లబ్ నిజనిర్ధారణ కమిటీగా ఏర్పాటై ముందుకు వచ్చింది. వాస్తవాలు తెలుసుకోవడానికి సదరు కమిటీకి టీటీడీ అనుమతిస్తున్నట్లు పేర్కొంది.
కొద్దిరోజుల కిందటే శ్వేతపత్రం విడుదల….
తాజాగానే విరాళాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది టీటీడీ. ఇటీవల కొందరు శ్రీవాణి ట్రస్టుపై అభియోగాలు చేశారని, అవన్నీ అవాస్తవమని ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. బంగారం డిపాజిట్ల మీద, ఫిక్సిడ్ డిపాజిట్ల మీద, టీటీడీ ఆస్తుల మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. శ్రీవాణి ట్రస్టుకు పదివేల విరాళం ఇచ్చి విఐపి దర్శనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేవారు. మే 31 ,2023 వరకు శ్రీవాణి ట్రస్టుకు 861 కోట్లు నిధులు వచ్చాయని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ః వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఎస్.బి ఖాతా క్రింద రోజూవారీ వచ్చే డబ్బు 139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉందని చెప్పారు. డిపాజిట్లుపై వడ్డీ రూపంలో 36.50 కోట్లు వచ్చిందన్నారు.
టీటీడీకి వివిధ రూపాల్లో వచ్చే విరాళాలను దేవాలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా 120.24 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణీ ట్రస్ట్ పై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేశారని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేసినవారిపై న్యాయసలహా తీసుకొని కచ్చితంగా కేసులు పెడతామని హెచ్చరించారుు. టిటిడిలో ఎంతటి వాడైన అవినీతి చేయడానికి భయపడాల్సిందేనని, తప్పు చేస్తే శిక్ష తప్పదు అది తానైనా శిక్షకు గురవుతామని చెప్పారు. ఏపీతో సహా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి వివరించారు. భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం రూ.227 కోట్ల 30 లక్షలు కేటాయింపులు జరిగాయని వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు వున్నా నేరుగా టీటీడీ ని సంప్రదించవచ్చన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు.
శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసినప్పటికీ… ఆరోపణలు ఆగటం లేదు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధుల నిజనిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చింది.