TTD NEWS : శ్రీవాణి ట్రస్టు ద్వారా 320 భజన మందిరాల నిర్మాణం
TTD NEWS టీటీవీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు ద్వారా 320 భజన మందిరాల నిర్మాణం జరుగుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ నాటికి వాటిలో 84 మందిరాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
TTD NEWS శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 320 భజన మందిరాలు నిర్మించనున్నట్టు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో డిసెంబరు నాటికి 84 భజన మందిరాల నిర్మాణం పూర్తి అవుతాయని చెప్పారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు, టిటిడి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ట్రెండింగ్ వార్తలు
సమరసత ఫౌండేషన్ నేతృత్వంలో రెండో విడతలో 111, మూడో విడతలో 209 భజన మందిరాల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. రెండో విడతకు సంబంధించి 84 భజన మందిరాల పనులు జరుగుతున్నాయని, మిగిలినవి డాక్యుమెంటేషన్ స్థితిలోనే ఉన్నాయని, వీటి పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు.
మూడో విడతలో 209 భజన మందిరాల స్థల సేకరణ పనులు పూర్తి చేసి త్వరలోనే వాటి నిర్మాణపనులు కూడా ప్రారంభించాలన్నారు. రెండో విడతలో పూర్తికానున్న 111 భజన మందిరాలకు విగ్రహాలను సిద్ధం చేయాలని సిఇని ఆదేశించారు. వీటిలో అర్చకులుగా పనిచేయబోయే వారికి శ్వేతలో అర్చక శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్కీమ్ వేదపారాయణ దారులు తమ పరిధిలోని భజన మందిరాలను సందర్శించేలా చూడాలన్నారు. వీటికి ధూపదీప నైవేద్యాల కోసం టిటిడి సహకారం అందిస్తుందని చెప్పారు. భజన మందిరాల నిర్మాణానికి ఏర్పాటుచేసిన కమిటీ త్వరగా పరిశీలన జరిపి నివేదిక అందించాలని కోరారు. నిర్మాణం ప్రారంభం కాని ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.
తిరుప్పావై ప్రవచనాల నిర్వహణకు అంగీకారపత్రాల ఆహ్వానం
పవిత్రమైన ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2023 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన విద్వాంసుల నుంచి అంగీకారపత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది. 2015 నుండి 2022వ సంవత్సరం వరకు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించిన విద్వాంసులు ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరడమైనది.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు నవంబరు 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ''ప్రత్యేకాధికారి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టిటిడి, తిరుపతి-517502'' అనే చిరునామాకు అంగీకారపత్రాలు పంపాల్సి ఉంటుంది. నమూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్సైట్లో పొందుపరిచారు.
ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చాలి…
టిటిడి ఉచితంగా అందిస్తున్న గోవులను చక్కగా పోషించుకుని గోమూత్రం, గోమయంతో భూసారాన్ని పెంచాలని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల నుండి విచ్చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులతో ఈవో సమావేశం నిర్వహించారు.
గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసినపుడు వారి సమక్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్తో టిటిడి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించేందుకు రైతు సాధికార సంస్థ గుర్తించిన రైతుల నుండి మార్క్ఫెడ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి టిటిడికి అందించాలని, తద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారని తెలిపారు.
ఈ మేరకు గతేడాది మొదటి విడతగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 2500 టన్నుల శనగలను కొనుగోలు చేశమన్నారు. వీటిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఐటిసి ప్రయోగశాలలో పరీక్షించగా ఎలాంటి రసాయన అవశేషాలు లేనట్టు గుర్తించారని తెలిపారు. ఈ ఏడాది మరో 12 రకాల ఉత్పత్తులు కలిపి దాదాపు 16 వేల టన్నులు సేకరించాలని టిటిడి బోర్డు నిర్ణయించిందని, ఈ మేరకు రైతు సాధికార సంస్థకు లేఖ ద్వారా తెలియజేశామని చెప్పారు. రానున్న కాలంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడికి అవసరమైన అన్ని వంట సరుకులను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవే కొనుగోలు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు రెండు వేలకు పైగా గోవులు, ఎద్దులను ఉచితంగా అందించామని వెల్లడించారు.
టాపిక్