No Covid Deaths: ఏపీలో కోవిడ్ మరణాలు లేవని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
21 April 2023, 6:04 IST
- No Covid Deaths: దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఏపీలో కోవిడ్ మరణాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు
No Covid Deaths: ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు లేవని వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నా, ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, గడిచిన 24 గంటల్లో 12591 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పాజిటివిటీ రేటు 5.32 శాతంగా నమోదైందని, ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు.
కోవిడ్ నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా మూడు కోవిడ్ మరణాలు సంభవించాయని వస్తున్న వార్తలపై స్పందించారు. కాకినాడ, విశాఖపట్నంలో నమోదైన మూడు మరణాలకి కరోనా కారణం కాదని స్పష్టం చేశారు.
మరణించిన వారిలో ఇద్దరు వైరల్ న్యూమోనియా, ఒకరు ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఏపీలో కరోనా మరణాలు లేవని, కరోనా పరీక్షల సంఖ్యని రోజుకు 5 వేలకి పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఫీవర్ సర్వేలో గుర్తించిన 17 వేల మంది జ్వర బాధితులకి పరీక్షలు నిర్వహించి, కరోనాపై అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఏపీలో గత వారంలో పాజిటివిటీ రేటు కేవలం 2.12 శాతం మాత్రమే ఉందని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని వివరించారు. కరోనా ప్రస్తుత వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల పాటు నిర్వహించిన కోవిడ్ మాక్ డ్రిల్ లో గుర్తించిన విషయాలని సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్నా, దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్పై ప్రజలు అనవసర భయాందోళనలకి గురి కావద్దని తెలిపారు. దీర్ఘకాలిక రోగాలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.