T Congress Six Guarantees: కాంగ్రెస్ 6 గ్యారంటీలు.. అమలే బిగ్ ఛాలెంజ్..! అవెంటో పూర్తిగా ఇక్కడ చూడండి
Telangana Congress Party Six Guarantees: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ పాలనపైనే ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలే అతిపెద్ద ఛాలెంజ్ గా మారింది.
Telangana Congress party Six Guarantees: కర్ణాటకలో జెండా ఎగరవేసిన కాంగ్రెస్… ఆ తర్వాత తెలంగాణనే పెట్టుకుంది. అందుకు తగ్గటే వర్కౌట్ చేసింది. పక్కా వ్యూహాలతో ముందుకొచ్చింది. అనుకున్నట్లే… తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసింది. ఏడాది కాలంగా… కీలకమైన డిక్లరేషన్లతో పాటు… హామీలతో ప్రజల్లోకి వెళ్లే పని పెట్టుకున్న కాంగ్రెస్…. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది. తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే… కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ కార్డే కీలకంగా మారిందనే చెప్పొచ్చు.
ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం…
తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… గురువారం అధికారికంగా సీఎంతో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం సందర్భంగా… సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం కూడా ఆరు గ్యారెంటీల హామీలపైనే చేశారు. అంతేకాదు… సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో కూడా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం… ఆరు గ్యారెంటీల హామీల అమలే అని అర్థమవుతోంది.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు :
1. మహాలక్ష్మి
-ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.
-రూ.500లకే గ్యాస్ సిలిండర్.
-రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం.
2. రైతు భరోసా
-ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం.
-ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం.
-వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన.
3. గృహజ్యోతి
-ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం.
4. ఇందిరమ్మ ఇళ్లు
-ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం.
-తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం.
5. యువ వికాసం
-విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు.
-ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు.
6. చేయూత
-పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను.
-ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీల అమల్లో ఉన్న ‘మహాలక్ష్మి’ స్కీమ్ పై అప్పుడే చర్చ మొదలైంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఎప్పట్నుంచి ప్రారంభమవుతుందనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే రైతుబంధు నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతుభరోసా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్… ఎప్పుడు ఈ నిధులను జమ చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జమ చేస్తే… కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారా అనే దానిపై కూడా చర్చ షురూ అయింది. ఇవేకాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాటు… ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల పెంపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటి విషయంలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్… ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిందనే చెప్పొచ్చు…!