AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో(AP TS Weather Report) ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా కంటే రెండు, మూడు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు అవుతున్నాయని వెల్లడించారు. మధ్యాహ్న సమయాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేసింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా. పగటి పూట వాతావరణం పొడి ఉంటుందని, క్రమంగా ఎండల తీవ్రత పెరుగతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
తెలంగాణలో (TS Weather)ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు (Day Temperatures) 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయన్నారు. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
గత ఏడాది(Last Summer) మాదిరిగానే వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో రాత్రి వేళ చల్లని వాతావరణం ఉంటున్నా, పగటి పూట ఉక్కపోత పెడుతుంది. గతేడాది ఈ సమయానికి 15-20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఈసారి 32 డిగ్రీలు దాటి పోయాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఎన్నడూ చూడని ఎండలు రికార్డుల చెరిపేశాయి. ఎండ తీవ్రతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు ఆదే స్థాయిలో ఉంటాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.