జనన ధ్రువీకరణ పత్రం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సర్టిఫికెట్ లేకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతాయి. ఓ వ్యక్తి ఎక్కడ జన్మించాడు..? పుట్టిన తేదీ..? తల్లిదండ్రులు ఎవరు..? అనే అంశాలను నిర్ధారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది.
జనన మరియు మరణాల నమోదు చట్టం- 1969 ప్రకారం ప్రతి జననాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయాలి . ప్రభుత్వం అందించే వివిధ సౌకర్యాలను పొందడానికి పౌరులందరూ జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది.
పుట్టినతేదీ సర్టిఫికెట్ కోసం దగ్గరలోని ఏదైనా మీసేవా కేంద్రంకు వెళ్ళాలి. అక్కడ వారు అడిగిన పత్రాలతో పాటు రుజువులను ఇవ్వాలి. మీ-సేవా కేంద్ర నిర్వాహకులు CDMA లో మీరు ఇచ్చిన సమాచారాన్ని పెట్టి దరఖాస్తు చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన ఏడాదిలోపు పుట్టినరోజు సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఏడాదిలోపు సర్టిఫికెట్ పొందాలంటే అధికారులు పొందుపరిచిన సమాచారం ప్రకారం మీ -సేవాలో పొందవచ్చు. ఒకవేళ ఏడాది దాటినట్లయితే.. కచ్చితంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా ప్రోసిడింగ్ పొందాల్సి ఉంటుంది. దీనినే LRBD ( లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ) అంటారు.
ఇలా పొందాలంటే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సంతకం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ( స్థానిక గ్రామపంచాయతీ ద్వారా ), అఫిడవిట్ తో పాటు దరఖాస్తు ఫారం నింపి మీ -సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించిన తర్వాత ప్రొసీడింగ్ కాపీ అందజేస్తారు. వెంటనే ప్రొసీడింగ్ కాపీని స్థానిక గ్రామపంచాయతీ సెక్రటరీకి లేదా మున్సిపల్ అధికారికి అందజేసి బర్త్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం