Kavitha petition: మళ్లీ సుప్రీం కోర్టు తలుపు తట్టిన ఎమ్మెల్సీ కవిత-brs mlc kavitha knocks supreme court for relief in enforcement directorate notices in delhi liquor scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Mlc Kavitha Knocks Supreme Court For Relief In Enforcement Directorate Notices In Delhi Liquor Scam

Kavitha petition: మళ్లీ సుప్రీం కోర్టు తలుపు తట్టిన ఎమ్మెల్సీ కవిత

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 08:39 AM IST

Kavitha petition: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత మరోమారు సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయనున్నారు.గురువారం నాటకీయ పరిణామాల నడుమ కవిత ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో 20న రావాలని ఈడీ మరోసారి నోటీసులివ్వడంతో కవిత సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ కోసం ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు (ANI Photo)
సుప్రీం కోర్టు (ANI Photo)

Kavitha petition: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ నోటీసులిచ్చిన నేపథ్యంలో మరోమారు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారన జరపాలని ఎమ్మెల్సీ కవిత, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని ఎదుట అభ్యర్ధించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితను 20వ తేదీన రావాలని ఈడీ ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మరోమారు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. తన పిటిషన్‌లపై అత్యవరస విచారణ జరపాలని అభ్యర్థించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ 24వ తేదీన జరగాల్సి ఉంది.

ఢిల్లీ మద్యం కేసు విచారణ విషయంలో ఈడీ, ఎమ్మెల్సీ కవితల మధ్య పోరు సాగుతోంది. ఈడీ విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కవిత న్యాయపోరాటం చేస్తున్నారు. తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో చెప్పలేదంటూ.. కవిత గురువారం విచారణకు గైర్హాజరయ్యారు. తన ప్రతినిధికి డాక్యుమెంట్లు ఇచ్చి పంపుతున్నట్లు చెబుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖను రాశారు. సుప్రీంకోర్టులో దాఖలుచేసిన కేసులో తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ వేచి చూడాలని సూచించారు.

విచారణ జాప్యం చేయడానికే ఉద్దేశపూర్వకంగా కవిత సాగదీస్తున్నారనే అనుమానం ఈడీ వ్యక్తం చేస్తోంది. కవిత లేఖపై ఈడీ స్పందించకపోయినా ఈ కేసులో మరో నిందితుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగింపుకు అభ్యర్ధించారు. కోసం దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో జరిగిన వాదనల సమయంలో ఎమ్మెల్సీ కవితను అనుమానితురాలిగా పేర్కొంటూ ఈ నెల 20వ తేదీన విచారణకు పిలిచినట్లు ప్రకటించారు. దీంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరోవైపు ఇదే కేసులో 18న హాజరుకావాలని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును 17న మరోసారి విచారించనున్నట్లు పేర్కొంది. అరుణ్‌ రామచంద్ర పిళ్లై పది రోజుల ఈడీ కస్టడీ గురువారంతో ముగిసినా ఆయనను మిగిలిన వారితో కలిపి విచారించాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో పిళ్లైకు కోర్టు 4 రోజులు కస్టడీ పొడిగించింది. తాజా పరిణామాలతో ఈ కేసు దర్యాప్తులో ఈడీ మరింత వేగం పెంచినట్లు కనిపిస్తోంది.

ఈ నెల 20న కవిత విచారణ

ఈడీ కేసులో అరెస్టైన పిళ్లైను మిగిలిన వారితో కలిపి విచారించాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో 20వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఈడీ విచారణకు కవిత రాలేదని ఈడీ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. న్యాయమూర్తి సందేహాలు వ్యక్తం చేయడంతో ఈడీ న్యాయవాది వివరణ ఇచ్చారు. 20వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు తెలిారు. మద్యం విధానంపై సమావేశాలు నిర్వహించిన హోటళ్లలోని రికార్డులు, ఇతర సాక్ష్యాలపై అరుణ్‌ రామచంద్ర పిళ్లైని, కవితను కలిపి విచారించాల్సి ఉందని ప్రత్యేక జడ్జికి వివరించారు. ఇదే కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని విచారించాల్సి ఉన్నందున ఆయనను 18వ తేదీ విచారణకు రావాలని సమన్లు పంపినట్లు తెలిపారు.

రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై...

వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 23కి వాయిదా వేసింది. రాఘవ్‌ను ఈడీ ఫిబ్రవరి పదో తేదీన అరెస్టు చేసి 11న కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం పది రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం ఫిబ్రవరి 20న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా 14 రోజుల చొప్పున జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 18తో ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌ ముగియనుంది. ఈ దశలో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. జడ్జి బెయిల్‌ పిటిషన్‌ విచాకణను 23వ తేదీకి వాయిదా వేశారు.

IPL_Entry_Point