Team India day out: క్రికెట్ పక్కన పెట్టి.. ఐలాండ్లో ఎంజాయ్ చేసిన టీమిండియా.. వీడియో
Team India day out: క్రికెట్ పక్కన పెట్టి.. ఐలాండ్లో ఎంజాయ్ చేసింది టీమిండియా. లాన్ బౌల్స్ ఆడుతూ.. అక్కడి జంతువులతో ఫొటోలు దిగుతూ, స్పెషల్ లంచ్ ఎంజాయ్ చేస్తూ గడిపారు ఇండియన్ ప్లేయర్స్.
Team India day out: టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా ఈ మెగా టోర్నీకి ముందు కాస్త రిలాక్సయింది. క్రికెట్ను ఒక రోజు పూర్తిగా పక్కన పెట్టేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని రోట్నెస్ట్ ఐలాండ్కు వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తోపాటు మిగిలిన టీమ్, సపోర్ట్ స్టాఫ్ అందరూ కలిసి ఓ యాట్లో సముద్రం మధ్యలో ఉన్న ఈ దీవికి వెళ్లారు.
మంగళవారం (అక్టోబర్ 11) ఇండియన్ టీమ్ ఈ ట్రిప్ ఎంజాయ్ చేయగా.. బుధవారం ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇండియన్ టీమ్ ఉంటున్న పెర్త్ నుంచి సముద్రంలో ఇది 16 కి.మీ. ట్రిప్. టీమ్ యాట్లో బయలుదేరిన సమయం నుంచి ఆ దీవిలో లాన్ బౌల్స్ ఆడుతూ, అక్కడే కనిపించే జంతువులతో ఫొటోలు దిగుతూ, స్పెషల్ లంచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
నిజానికి మంగళవారం తన 29వ పుట్టిన రోజు జరుపుకున్న హార్దిక్ పాండ్యా కూడా ఈ రోట్నెస్ట్ దీవిలోనే కేక్ కట్ చేశాడు. మిగతా టీమ్ సభ్యులంతా కలిసి హార్దిక్ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఒక రోజు ఆటకు పూర్తిగా విరామం ఇచ్చి కాస్త రిలాక్స్ కావాలన్న ఉద్దేశంతోనే ఈ టూర్ ఏర్పాటు చేసినట్లు టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టాన్ చెప్పాడు.
ఈ టూర్ను టీమ్ బాగా ఎంజాయ్ చేసినట్లు హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పారు. ఐలాండ్లో ఇండియన్ టీమ్ ప్లేయర్స్ లాన్ బౌల్స్ ఆడటం విశేషం. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్, అర్ష్దీప్ సింగ్, రిషబ్ పంత్లాంటి వాళ్లు లాన్ బౌల్స్ ఆడుతూ కనిపించారు. టీమిండియా టూర్కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. అందులోనూ దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా షేర్ చేసింది. బీసీసీఐ.టీవీలో ఈ పూర్తి వీడియో చూడొచ్చు. అక్టోబర్ 6న వరల్డ్కప్ కోసం రోహిత్ కెప్టెన్సీలోని టీమ్ వెళ్లిన విషయం తెలిసిందే.
అక్కడ 8 రోజుల పాటు టీమ్ ప్రాక్టీస్ చేయనుంది. ఇందులో భాగంగా వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. ఇందులో తొలి మ్యాచ్ ఈ నెల 10న ఆడగా.. అందులో ఇండియా 13 రన్స్తో గెలిచింది. గురువారం (అక్టోబర్ 13) మరో మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.