Rohit Sharma on Bumrah Replacement: బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌-rohit on bumrah replacement says will take a decision after reaching australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit On Bumrah Replacement Says Will Take A Decision After Reaching Australia

Rohit Sharma on Bumrah Replacement: బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌

Hari Prasad S HT Telugu
Oct 05, 2022 06:22 AM IST

Rohit Sharma on Bumrah Replacement: బుమ్రా స్థానంలో ఎవరు అన్న చర్చపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ స్పందించాడు. దీనిపై ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

సౌతాఫ్రికాపై గెలిచిన టీ20 ట్రోఫీతో రోహిత్ శర్మ
సౌతాఫ్రికాపై గెలిచిన టీ20 ట్రోఫీతో రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma on Bumrah Replacement: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇండియాకు జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం రూపంలో పెద్ద దెబ్బే తగిలిన విషయం తెలుసు కదా. ఈ స్టార్‌ బౌలర్‌ మెగా టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు అన్న చర్చ మొదలైంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని గవాస్కర్‌లాంటి మాజీలు అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

దీనిపై తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మే స్పందించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20 ముగిసిన తర్వాత అతడు మాట్లాడాడు. బుమ్రా స్థానంలో ఎవరు అన్నదానిపై ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రోహిత్‌ చెప్పాడు. ప్రస్తుతానికైతే వరల్డ్‌కప్‌ టీమ్‌ స్టాండ్‌బైల లిస్ట్‌లో ఉన్న మహ్మద్‌ షమి, దీపక్‌ చహర్‌లలో ఒకరికి 15 మంది సభ్యుల టీమ్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.

"ఫలితంతో సంబంధం లేకుండా ఓ టీమ్‌గా మెరుగవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని మొదటి నుంచీ చెబుతున్నాను. ఓ టీమ్‌గా మెరుగవ్వాలని అనుకుంటున్నాం. టీమ్స్‌ అన్నీ చాలా సవాలుతో కూడుకొని ఉన్నాయి. మా టీమ్‌ను అన్ని రంగాల్లో సవాలు చేయగలవు. కొన్ని విషయాలపై చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా అంశాలను పరిశీలిస్తున్నాం. సూర్య ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది (నవ్వుతూ). మా బౌలింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంది. రెండు నాణ్యమైన టీమ్స్‌తో ఆడాము. కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నాం" అని మ్యాచ్‌ తర్వాత రోహిత్ అన్నాడు.

టీమ్‌లో చాలా మంది ఆస్ట్రేలియాకు వెళ్లలేదని, అందుకే ఎంతో ముందుగానే అక్కడికి వెళ్లి పెర్త్‌లోని పేస్‌ కండిషన్స్‌కు అలవాటు పడాలని అనుకుంటున్నట్లు రోహిత్‌ చెప్పాడు. ఇక ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుండటం ఇండియాకు కలిసొస్తుందని అన్నాడు. "మేమెంత మెరుగ్గా ఆడగలమో చూడాలి. ఈ విషయంలో టీమ్‌ సభ్యులందరికీ చాలా స్పష్టత కావాలి. అది ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ పని కొనసాగుతూ ఉంది. దానికి సమాధానాలు వెతుకుతూనే ఉన్నాం" అని రోహిత్‌ చెప్పాడు.

"ప్రస్తుత టీమ్‌లో 7, 8 మాత్రమే ఆస్ట్రేలియాకు వెళ్లారు. అందుకే అక్కడ కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఏర్పాటు చేశాం. ఏ కాంబినేషన్‌లో ఆడాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంది. బుమ్రా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. అందుకే ఆస్ట్రేలియాలో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న బౌలర్‌ కోసం చూడాలి. ఆ బౌలర్‌ ఎవరన్నది తెలియదు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం" అని రోహిత్‌ స్పష్టం చేశాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే అంతకంటే ముందు అక్టోబర్‌ 17, 19 తేదీల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో రెండు వామప్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతాయి. ఇది చాలా బౌన్సీ పిచ్‌. ఒకరకంగా వరల్డ్‌కప్‌కు ముందు ఇండియన్‌ టీమ్‌కు ఇలా మంచి వామప్‌ లభిస్తుంది.

WhatsApp channel