Budhwa mangal 2024: బడా మంగళవారంలో ఇలా చేశారంటే హనుమంతుడి ఆశీస్సులతో అన్నీ శుభాలే-budhwa mangal 2024 pariharalu for seeking lord hanuman blessing in jyeshta month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Budhwa Mangal 2024: బడా మంగళవారంలో ఇలా చేశారంటే హనుమంతుడి ఆశీస్సులతో అన్నీ శుభాలే

Budhwa mangal 2024: బడా మంగళవారంలో ఇలా చేశారంటే హనుమంతుడి ఆశీస్సులతో అన్నీ శుభాలే

Gunti Soundarya HT Telugu

Budhwa mangal 2024: జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాలను బడా మంగళవారాలుగా పిలుస్తారు. ఈ సమయంలో హనుమంతుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. కష్టాలన్నీ తీరిపోయి అన్నీ శుభాలే.

బడా మంగళ్ 2024 (pixabay)

Budhwa mangal 2024: హిందూమతంలో మంగళవారం నాడు హనుమంతుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. హనుమంతుని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు తొలగిపోయి అన్ని రంగాల్లో అపారమైన విజయాలు పొందుతారని నమ్ముతారు.

హిందూ క్యాలెండర్ లోని మూడవ నెల జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం హనుమంతుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలోనే ప్రతి మంగళవారాన్ని బడా మంగళ్ లేదా బుద్వా మంగళ్ అంటారు. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధిస్తే జీవితంలోని కష్టాలన్నీ దూరమవుతాయి. అది మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. 

బడా మంగళ్ సమయంలో హనుమంతుడిని సంతోషపెట్టేందుకు ఈ సులభమైన మార్గాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది. మీకు భజరంగబలి ఆశీస్సులు నిత్యం లభిస్తాయి. 

విజయం కోసం 

ఉద్యోగ వ్యాపారంలో పురోగతి కోసం బడా మంగళవారాల్లో హనుమంతుని ఆలయానికి వెళ్లాలి. హనుమంతుడి విగ్రహం నుంచి కుంకుమ తీసి సీతాదేవి పాదాలకు పూయాలి. ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో ఆపారమైన విజయం లభిస్తుందని నమ్ముతారు.

దోషం పోయేందుకు 

శని అశుభ ప్రభావాల నుంచి బయటపడేందుకు హనుమంతుడిని పూజించడం చాలా ముఖ్యం. జ్యేష్ఠ మాసంలోనే ఏ మంగళవారమైన మినుములు, నలుపు వస్త్రాలు నిరుపేదలకు దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. 

కష్టాల నుంచి ఉపశమనం కోసం 

ఇంట్లో గృహ బాధల నుండి విముక్తి పొందేందుకు బడా మంగళవారం రోజున హనుమంతుడికి 21 అరటి పండ్లు సమర్పించి తర్వాత వాటిని కోతులకు ఆహారంగా ఇవ్వాలి. ఈ పరిహారం వల్ల హనుమంతుడు వెంటనే సంతోషించి తన భక్తులకు కష్టాలన్నీ తొలగిస్తాడని చెబుతారు. 

ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే బడా మంగళవారం నాడు హనుమంతుడిని పూజించి నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే హనుమంతుడికి ఎంతో ప్రీతి కరమైన తమలపాకులతో దండ సమర్పించడం వల్ల మీరు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. 

మంగళవారం నాడు హనుమంతుడికి ఇష్టమైన చోళం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మంగళవారం నాడు మాత్రమే కాకుండా శనివారం కూడా ఈ పరిహారం పాటించవచ్చు. అలాగే బూందీ, మినుములతో చేసిన పదార్థాలు భోగంగా సమర్పించవచ్చు. 

రోగాల నుంచి విముక్తి కోసం 

ప్రతి మంగళవారం తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి హృదయపూర్వకంగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా 21 రోజులు  చదవటం వల్ల శత్రు బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

హనుమాన్ విగ్రహాన్ని దర్శించి 21 మంగళవారాలు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని రోగాల నుంచి బయటపడతారు. 

ప్రతి మంగళవారం ఏడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది. బూందీని ప్రసాదంగా సమర్పించాలి .ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల శారీరక, మానసిక బలం పెరుగుతుంది. హనుమంతుడు సంతోషించి తన భక్తులను సుఖసంతోషాలతో ఆశీర్వదిస్తాడు. సకల బాధల నుంచి  విముక్తి కలిగిస్తాడు.