Russia Ukraine Conflict live updates | రష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ-russia ukraine crisis live updates russia starts military operation in ukraine ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia Ukraine Crisis Live Updates Russia Starts Military Operation In Ukraine

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం

Russia Ukraine Conflict live updates | రష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ

12:21 PM ISTHT Telugu Desk
  • Share on Facebook
12:21 PM IST

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఆ దేశంలోని కొంత భూ భాగాన్ని రష్యా ఆక్రమించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల వర్షం కురిపించింది. కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా అంతర్జాతీయ వార్త సంస్థలు ప్రకటించాయి.

Fri, 11 Mar 202212:12 PM IST

రష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని న‌రేంద్ర మోదీ గురువారం రాత్రి రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న తాజా పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానికి వివరించారు.

రష్యా- నాటో బృందాల మధ్య విభేదాలు నిజాయితీ, నమ్మకంతో కూడా చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని మోదీ పునరుద్ఘాటించారు. యుద్ధాన్ని విరమించుకోవాలని అధ్యక్షుడు పుతిన్ కు విజ్ఞప్తి చేసినట్లు ప్రధాని తెలిపారు. దౌత్యపరమైన చర్చలకు అన్ని దేశాలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక, ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి కూడా రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ చర్చించారు. వారందరినీ సురక్షితంగా స్వదేశం తీసుకురావడం ఇండియాకు అత్యంత ప్రాధాన్య అంశం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Fri, 11 Mar 202212:16 PM IST

తెలుగు విద్యార్థులతో మాట్లాడిన బండి సంజయ్, తామున్నామని పేరేంట్స్‌కి భరోసా!

ఉక్రెయిన్ లో చిక్కుకున్న పలువురు తెలుగు విద్యార్థులతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. వారి క్షేమ సమాచారం తెలుసుకొని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

జగిత్యాల జిల్లా, మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బద్ధం నిహారిక అనే విద్యార్థిని ఉక్రెయిన్ లో ఉండిపోయింది. ఎంపీ బండి సంజయ్ ఈరోజు ఆ గ్రామానికి వెళ్లి నిహారిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిహారిక తో వీడియో కాల్ లో మాట్లాడి అక్కడి పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. అయితే రష్యా దాడులతో నిన్న రాత్రి నుండి భయం భయంగా గడుపుతున్నామని నిహారిక వాపోయారు. తాను ఉన్న దగ్గర పరిస్థితి కొంత వరకు పరవాలేదని, మిగిలిన చోట్ల పరిస్థితి భయానకంగా ఉందని ఆమె బండి సంజయ్ కు వివరించింది. అయితే ఎవరూ టెన్షన్ పడొద్దని బండి సంజయ్ సముదాయించారు. అక్కడున్న అందరినీ సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయాన్ని తెలిపి మనో ధైర్యం నింపాలని నిహారిక కు సూచించారు.

నిహారిక చదువుకుంటున్న వర్సిటీలో తెలుగు వాళ్ళందరి ఫోన్ నంబర్లు పంపితే అందరితో మాట్లాడి భారత్ తీసుకొచ్చేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ తో సంప్రదింపులు జరుపుతామని భరోసా ఇచ్చారు. అక్కడున్న నిహారిక ఫ్రెండ్స్ భవానీ, సాయి జయంత్, గుడియా లతోనూ బండి సంజయ్ మాట్లాడారు. తమకు చాలా భయమేస్తోందని ఏడుస్తున్న వారితో "ఆందోళన పడొద్దు. మిమ్ముల్ని ఇండియా కు స్పెషల్ ఫ్లయిట్ లో తీసుకొచ్చేందుకు మోదీ గారు చర్యలు తీసుకుంటున్నారు. " అని ధైర్యం నింపారు.

Thu, 24 Feb 202204:54 PM IST

యుద్ధం మొదటి రోజు ఎవరి వైపు ఎంత నష్టం జరిగింది? రష్యా- ఉక్రెయిన్‌లా యుద్ధ నివేదికలు..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రేనియన్ పై 'మిలటరీ ఆపరేషన్' ప్రకటించిన మరుక్షణం నుంచి రష్యన్ సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డాయి. యుద్ధం మొదటి రోజైన గురువారం 74 ఉక్రేనియన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం తెలిపింది.

అలాగే పదకొండు ఉక్రేనియన్ ఎయిర్‌ఫీల్డ్‌లు, మూడు కమాండ్ పోస్ట్‌లు, ఒక నావికా స్థావరం నిర్వీర్యం చేసినట్లు ప్రకటించారు.

వీటితో పాటు నాలుగు బైరక్టార్ TB-2 వార్ డ్రోన్‌లు, ఒక ఫైటర్ హెలికాప్టర్‌ను కూల్చివేయడమే కాకుండా S-300, Buk-M1 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన 18 ఉక్రేనియన్ రాడార్ స్టేషన్‌లు తమ మిలటరీ ఆపరేషన్లో ధ్వంసం అయ్యాయని రష్యా ప్రకటించింది.

మరోవైపు, ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యన్ దాడిని దీటుగా ప్రతిఘటించినట్లు తెలిపింది. 15 రష్యన్ T-72 ట్యాంకులను ధ్వంసం చేశామని, అలాగే రష్యాకు చెందిన ఏడు యుద్ధ విమానాలు, రెండు ఫైటర్ హెలికాప్టర్లను కూల్చివేశామని ఉక్రేనియన్ సైన్యం ప్రకటించింది. అంతేకాకుండా రష్యన్ ఆర్మీకి చెందిన ఐదు ఆర్మీ క్యారియర్‌లను పేల్చివేశాం, ఈ దాడిలో సుమారు 50 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ నివేదించింది.

Thu, 24 Feb 202204:15 PM IST

ఉక్రెయిన్‌లోని తెలుగు వారిని ఇండియాకి రప్పించండి : కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఇండియాకి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకురావడంలో మీరు చూపిన చొరవ మరువలేనదని కొనియాడారు. ఇప్పుడు దాదాపు 4000 మంది తెలుగు విద్యార్థులు, విద్యావంతులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నారని, వారంతా ఏటీఎంలలో నగదు తీసుకునేందుకు అవకాశం లేకుండా, తినేందుకు తిండి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు తెలిపారు. ఒడెస్సా, కీవ్ పట్టణాలలో యూనివర్శిటీలు, కార్యాలయాలు మూసివేయడంతో తెలుగు ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలుగు విద్యార్థులు ఇండయన్ ఎంబసీ ఏర్పాటు చేసిన ఒక స్కూల్ లో తలదాచుకుంటున్నారు. వారి యోగక్షేమాలపై ఇక్కడ వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన చెందుతున్నారు. కావున సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలను స్వదేశానికి తీసుకురావాలని చంద్రబాబు తన లేఖ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Fri, 11 Mar 202212:16 PM IST

భారత విద్యార్థుల క్షేమం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడికి లేఖ

ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారత ఎంబసీ లేఖ రాసింది. ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ మేరకు వారికి తగిన భద్రత కల్పించాలని భారత ఎంబసీ తన లేఖలో అభ్యర్థించింది. విద్యార్థులకు కనీస సౌకర్యాలైన ఆహారం, నీరు అలాగే ఉండటానికి సురక్షితమైన చోటు కల్పించాలని కోరింది. విద్యార్థుల క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా భారత్ తెలిపింది. ఈ మేరకు వెంటనే స్పందించిన తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎంబసీ తన లేఖలో స్పష్టం చేసింది.

Fri, 11 Mar 202212:16 PM IST

రష్యా అధ్యక్షుడితో మాట్లడనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ తన నివాసంలో క్యాబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై చర్చించారు. ముఖ్యంగా ముడి చమురు దాని ప్రభావం ఏమేరకు ఉండొచ్చనేది చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.

Fri, 11 Mar 202212:16 PM IST

భారతీయుల తరలింపు కోసం హంగేరీ ప్రభుత్వంతో సంప్రదింపులు

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు కోసం భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం హంగేరీలోని భారత రాయబార కార్యాలయం నుండి ఓ బృందాన్ని జోహనీ సరిహద్దు పోస్ట్‌కు పంపారు. భారతీయులను సురక్షితంగా తరలించడం కోసం, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడం కోసం హంగేరీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు ప్రారంభించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

భారతీయులందరి క్షేమం దృష్ట్యా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేస్తుందని ఉక్రెయిన్‌లోని భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఎవరైనా కైవ్‌లో చిక్కుకుపోయినట్లయితే సమీపంలోని స్నేహితులు, బంధువులు లేదా భారతీయ కమ్యూనిటీ ఉన్న చోటికి వెళ్లాలని ఆయన సూచించారు. సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని పార్థ సత్పతి స్పష్టం చేశారు.

Thu, 24 Feb 202203:11 PM IST

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయుల క్షేమ సమాచారంపై ప్రధాని ఆరాతీశారు. తాజా పరిణామాలపై ఆయన చర్చిస్తున్నారు. ప్రధాని సమావేశానికి కేంద్ర కేబినేట్ లోని కీలక మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల క్షేమం కోసం ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Thu, 24 Feb 202201:37 PM IST

ఉక్రెయిన్‌లో భారతదేశం నుంచి 24,000 మంది విద్యార్థులు

ఉక్రెయిన్‌లో భారతదేశం నుంచి 24,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 2,300 మంది ఉన్నారని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ శశి థరూర్ అన్నారు. వారి క్షేమం గురించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తనకు చాలా సందేశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయడం కారణంగా ఇప్పుడు విమానాలు నడపడం సాధ్యపడదని ఆయన అన్నారు.

యుద్ధం విషయంలో జోక్యం చేసుకోవాలని భారత్‌ను ఉక్రెయిన్ కోరడం సమంజసమేనని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. హింస, యుద్ధం ద్వారా ఇతర దేశాలపై దండయాత్ర చేసి ఒక ప్రాంతాన్ని దురాక్రమణ చేయడాన్ని తాము సమర్ధించబోమని పేర్కొన్నారు.

ఒక వేళ చైనా మన దేశంవైపు దూసుకొస్తే మనం ప్రపంచ దేశాల మద్ధతు కోరతాం. అలాగే ఉక్రెయిన్ కోరింది, కాబట్టి భారత్ తటస్థ వైఖరి అవలంబించకుండా సరైన వైపు ఉండాలి అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Thu, 24 Feb 202201:14 PM IST

ఉక్రెయిన్ మిలటరీ విమానం కూల్చివేత

14 మందితో వెళ్తోన్న ఉక్రెయిన్ మిలటరీ విమానం రాజధాని క్వీవ్ సమీపంలో కూల్చివేసిన రష్యా

Fri, 25 Feb 202212:36 PM IST

 పుతిన్ మానవత్వం చూపించాలి: ఐక్యరాజ్య సమితి

Fri, 11 Mar 202212:16 PM IST

దగ్గర్లోని బాంబ్ షెల్టర్లలో తలదాచుకోండి: ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచన

ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం దేశ పౌరులను ఉద్దేశించి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రశాంతంగా ఉండండి, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి అంటూ సూచించింది. సమస్యకు పరిష్కారం కోసం తమవైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని, ఆందోళన చెందవద్దని భరోసా కల్పించింది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపిస్తే దగ్గర్లోని బాంబ్ షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించింది.

Fri, 11 Mar 202212:16 PM IST

పుతిన్ దే బాధ్యత

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధా్న్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. యుద్ధం నుంచి వెనక్కు రావాలని కోరుతున్నాయి. మరోవైపు ఐరోపా కమిషన్ కూడా యుద్ధాన్ని తీవ్రంగా ఖండించింది. పుతిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ పేర్కొన్నారు.

 

Thu, 24 Feb 202212:23 PM IST

కుప్పకూలిన మార్కెట్లు

రష్యా దళాలు ఉక్రెయిన్ అంతటా దాడి చేయడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లలాగే కుదేలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత ఘోరమైన భద్రతా సంక్షోభాన్ని రేకెత్తించిన తాజా పరిస్థితి వల్ల మార్కెట్లు విలవిల్లాడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 5% వరకు క్షీణించింది. సెన్సెక్స్ 4.7% పడిపోయింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మార్చి 2020లో భారీగా కుప్పకూలిన మార్కెట్లు తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడితో మళ్లీ విలవిలలాడాయి. ఏడు రోజుల నష్టాలతో సుదీర్ఘమైన నష్టాలను చవిచూశాయి.

Thu, 24 Feb 202212:07 PM IST

యుద్ధం చేయాలని పుతిన్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు: బైడెన్

రేపు జీ 7 దేశాలతో సమావేశం అవనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చెప్పారు. నాటో కూటమికి సహకారం ఉంటుందని వెల్లడించారు. యుద్ధం చేయాలని పుతిన్ ముందస్తుగానే నిర్ణయించుకున్నారని బైడెన్ ఆరోపించారు. పుతిన్ తీసుకున్న నిర్ణయంతో ఎంతో నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

Thu, 24 Feb 202212:07 PM IST

వైరల్ అవుతున్న పాక్ ప్రధాని కామెంట్స్

Thu, 24 Feb 202211:52 AM IST

మానవత్వం చూపించి వెనక్కు తగ్గాలి: ఐక్యరాజ్య సమితి

Thu, 24 Feb 202211:44 AM IST

ఉక్రెయిన్ నుంచి 18 వేల మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు: భారత విదేశాంగ శాఖ

ఉక్రెయిన్ లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. 18 వేల మందిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్ లోని.. ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్టు విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు.

Thu, 24 Feb 202211:43 AM IST

కివ్ లోని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పొగలు

Thu, 24 Feb 202211:20 AM IST

జర్మన్ పార్లమెంటరీ అత్యవసర సమావేశం

ఉక్రెయిన్ దాడిపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ అత్యవసర పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుతిన్ శాంతిని దెబ్బతీస్తున్నాడని.. ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

 

Thu, 24 Feb 202211:22 AM IST

రష్యా, ఉక్రెయిన్ పరిణామాలపై మోడీ సమీక్ష

రష్యా, ఉక్రెయిన్ పరిణామాలపై.. ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. అక్కడ చిక్కుకున్న భారతీయుల గురించి ఆరా తీస్తున్నారు. వారిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని.. ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులపై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

Thu, 24 Feb 202211:05 AM IST

తెలుగు విద్యార్థుల కోసం.. ప్రత్యేక నెంబర్లు

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055, అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మను నియమించారు. 7531904820 నెంబర్ ను సంప్రదించాలి.

Thu, 24 Feb 202211:21 AM IST

హైదరాబాద్ చేరుకున్న 30 మంది విద్యార్థులు..

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి.. అక్కడున్న విద్యార్థుల్లో భయందోళన మెుదలైంది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందోననుకున్నారు అంతా. ఇప్పటికీ చాలా మంది అక్కడే ఉన్నారు. తాజాగా 30 మంది విద్యార్థులు.. హైదరాబాద్ కు సురక్షితంగా చేరుకున్నారు. షార్జా నుంచి వచ్చిన విమానంలో వీరంతా వచ్చారు.

Fri, 11 Mar 202212:17 PM IST

బాంబుల దాడిలో గాయపడిన క్షతగాత్రులు

Thu, 24 Feb 202210:40 AM IST

దేశం కోసం ఆయుధాలు పట్టండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

దేశం కోసం పోరాడాలనుకునేవారు తప్పకుండా యుద్ధం చేయాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకునే బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. ఆయుధాలు పట్టుకుని.. యుద్ధంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Thu, 24 Feb 202210:23 AM IST

బండి సంజయ్ కు విద్యార్థుల ఫోన్

ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుతన్న కొంతమంది విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ కి ఫోన్ చేశారు. కీవ్ ఎయిర్ పోర్టులో తాము చిక్కుకున్నట్టు చెప్పారు. వెంటనే ఆయన కేంద్రమంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించాలని కోరారు. దీంతో విదేశాంగ శాక ఉక్రెయిన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

Thu, 24 Feb 202210:31 AM IST

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం హోరాహోరిగా సాగుతోంది. ఇప్పటికే రష్యా రెండు నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలు.. బాంబులతో దద్దరిల్లుతున్నాయి. చాలామంది ప్రజలు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. రష్యా దూకుడుగా వ్యవహరిస్తుంటే.. ఉక్రెయిన్ సైతం ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే.. రష్యాకు చెందిన యుద్ధ విమానాలు, ట్యాంకర్లను.. ఉక్రెయిన్ నాశనం చేసింది.

Thu, 24 Feb 202210:04 AM IST

40 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి

మరోవైపు 40 మంది ఉక్రెయిన్ సైనుకులు చనపోయినట్టు వార్తలు వస్తున్నాయి. చాలామంది గాయపడినట్టు తెలుస్తోంది.

Thu, 24 Feb 202209:58 AM IST

50 మందిని మట్టుబెట్టాం... ఉక్రెయిన్ ప్రకటన

50 మంది రష్యా ఆక్రమణదారులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నాలుగు యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేశామని తెలిపింది. ఆయుధం పట్టే సత్తా ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ దళాలకు మద్దతుగా రావాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్పారు.

Thu, 24 Feb 202209:17 AM IST

ఎంబసీ కీలక ప్రకటన

ఉక్రెయిన్ లోని భారతీయులకు ఎంబసీ కీలక ప్రకటన జారీ చేసింది. ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారని.. ప్రత్యామ్మాయాలు చూస్తున్నామని తెలిపింది. త్వరలో వివరాలు వెల్లడిస్తామని..,భారతీయులందరూ పశ్చిమవైపు రావాలని.. చెప్పింది. పాస్ పోర్ట్ తో పాటు.. కావాల్సిన పత్రాలు తీసుకుని రావాలని చెప్పింది. ఎంబసీకి చెందిన వెబ్ సైట్, సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలని సూచించింది.

<p>ఇండియన్ ఎంబసీ</p>
ఇండియన్ ఎంబసీ

Fri, 11 Mar 202212:19 PM IST

ఉక్రెయిన్ లో ఎయిర్ స్పేస్ పరిస్థితి

Thu, 24 Feb 202209:15 AM IST

చాలామంది చనిపోయారు

మరోవైపు రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్ ప్రజలు చనిపోయారని.. భారత్ లో ఉక్రెయిన్ రాయభారి ఇగోర్ పోలిఖా తెలిపారు. సంక్షోభ సమయంలో భారత్ తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ తోపాటు ఇతర దేశాలు తమకు మద్దతు తెలిపాయన్నారు.

Thu, 24 Feb 202209:04 AM IST

భారత్ తటస్థ వైఖరి

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ తటస్థవైఖరిని అవలంబిస్తోంది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని భారతీయుల భద్రత పట్ల దృష్టి పెట్టినట్టు పేర్కొంది. అక్కడున్న వారికోసం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపింది. 

Fri, 11 Mar 202212:20 PM IST

పశ్చిమ వైపు నుంచి దాడి

రష్యా సైన్యం మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఉక్రెయిన్ పశ్చిమ వైపు నుంచి కూడా దాడి మొదలుపెట్టింది. బెలారస్ వైపు నుంచి రష్యా బలగాలు ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్ ఏజెన్సీపై దాడులు చేస్తున్నాయి.

 

Thu, 24 Feb 202208:27 AM IST

సరిహద్దు దాటి లోపలికి వచ్చిన రష్యా బలగాలు

ఉక్రెయిన్ పై రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రష్యా బలగాలు.. సరిహద్దు దాటి ఉక్రెయిన్ లోకి వెళ్లాయి. లుహాన్స్క్ ప్రాంతంలో రెండు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకుంది రష్యా. అయితే ఉక్రెయిన్ కూడా ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. రష్యాపై దీటుగా స్పందిస్తుంది.

Thu, 24 Feb 202208:24 AM IST

అపార్ట్ మెంట్ పై వైమానిక దాడి

Thu, 24 Feb 202208:16 AM IST

ఏడుగురు మృతి

రష్యా దాడుల్లో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ లోని నివాస ప్రాంతాలపైనా.. రష్యా దాడి చేస్తోంది. వైమానిక దాడిలో ఖర్కీవ్ లోని ఓ అపార్ట్ మెంట్ ధ్వంసమైంది.

Thu, 24 Feb 202207:33 AM IST

ఏటీఎం, పెట్రోల్ బంకుల ముందు బారీ క్యూ లైన్లు

తాజాగా రష్యా పశ్చిమ ఉక్రెయిన్ నుంచి సైతం దాడులు మెుదలు పెట్టింది. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ కారణంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఏటీఎంలు, పెట్రోల్ బంకులు ముందు.. బారులు తీరారు. నిత్యవసరాల కోసం.. దుకాణాలు ముందుకు వచ్చారు.

Thu, 24 Feb 202207:16 AM IST

భారతీయులకు కేంద్రం కీలక సూచనలు

ఉక్రెయిన్ లోని భారతీయులకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా.. ఉన్నాయని తెలిపింది. ఉక్రెయిన్ లో అనిశ్చితి ఉందని.. భారతీయులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పింది. ఇళ్లు, హాస్టళ్లు.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలిపింది. పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాల.. నుంచి రాజధాని కీవ్ కు వచ్చేవారు.. తిరిగి వెళ్లాలని ఉక్రెయిన్ భారత రాయభార కార్యాలయం సూచించింది.

 

Thu, 24 Feb 202207:08 AM IST

జీ-7దేశాల సమావేశం

ఉక్రెయిన్ పై రష్యా దూకుడును తగ్గించేందుకు.. అమెరికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. జీ-7 దేశాల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో పుతిన్ మాట్లాడారు. సరైన సమయంలో.. స్పందిస్తామని చెప్పారు. కలిసి వచ్చే దేశాలతో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Thu, 24 Feb 202207:32 AM IST

భారతీయుల ఇబ్బందులు

ఉక్రెయిన్ విమానాశ్రయంలో పలువురు భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం.. కోసం బోరిస్కిల్ ఎయిర్ పోర్ట్ వద్ద పడిగాపులు కాస్తు్న్నారు. కొన్ని గంటలుగా భారత్ రాయభార కార్యాలయంలోనే ఉన్నారు. ఎయిర్ ఇండియా.. విమానం ఇప్పటికె వెనక్కు వచ్చింది. ఉక్రెయిన్ లో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.

Thu, 24 Feb 202206:49 AM IST

ప్రభుత్వ సైట్లపై సైబర్ దాడులు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతుంది. వ్లాదిమిర్ పుతిన్.. ప్రకటించిన వెంటనే.. ఉక్రెయిన్ ముఖ్యనగరాల్లో బాంబులు వర్షం కురిసింది. ఉక్రెయిన్ పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకింగ్ వెబ్​సైట్లు సైబర్ దాడులు జరిగాయి. మాల్​వేర్​ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారు.

Thu, 24 Feb 202206:36 AM IST

5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చిన ఉక్రెయిన్

లుహాన్స్క్‌ ప్రాంతంలో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుందని.. ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. సరిహద్దు వెంబడి ఉక్రెయిన్ భూభాగం వైపుగా స్థావరాలపై ఫిరంగిలు ప్రయోగించారు. ఉక్రెయిన్ సాయుధ దళాలు వైమానిక దాడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పూర్తిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

Thu, 24 Feb 202206:33 AM IST

ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే: జర్మన్ ఛాన్సలర్

జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మాట్లాడి జర్మన్ సంఘీభావానికి హామీ ఇచ్చారని ప్రభుత్వ ప్రతినిధి ట్విట్టర్‌లో తెలిపారు. ‘ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే’ అని తెలిపారు. ఈ దాడి తీవ్రమైన రాజకీయ, ఆర్థిక పరిణామాలను కలిగి ఉంటుందని అన్నారు.

జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం ఈ రోజును మరచిపోదని, జర్మనీ తన భాగస్వాములతో కలిసి స్పందిస్తుందని అన్నారు.

Thu, 24 Feb 202206:17 AM IST

పెరిగిన బంగారం ధరలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై గురువారం తెల్లవారుజామున దాడి ప్రకటన చేశారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామానికి తరలివెళ్లడంతో గురువారం బంగారం ధరలు 2% పైగా పెరిగాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకు 8 శాతం పెరిగింది.

బంగారం 1.6% పెరిగి ఔన్సుకు $1,937.82 వద్దకు చేరింది. అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ 2% పెరిగి $1,937.10కి చేరుకుంది.

Thu, 24 Feb 202205:46 AM IST

పడిపోతున్న రష్యా కరెన్సీ విలువ

రష్యా కరెన్సీ రూబుల్ మారకం విలువ పడిపోతూ వస్తోంది. పుతిన్ తాజా ప్రకటనతో 2016 నాటి కనిష్టానికి చేరుకుంది. రష్యా దళాలు ఉక్రెయిన్ నగరాలపై దాడికి దిగాక రూబుల్ 2016 నాటి కనిష్ట స్థాయికి క్షీణించింది. బ్లూమ్‌బర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం గురువారం ఆన్‌షోర్ ట్రేడింగ్‌లో రష్యన్ కరెన్సీ డాలర్ విలువతో పోల్చితే 3.5% తగ్గి 84.1కి పడిపోయింది. ట్రేడింగ్ బ్యాండ్ పరిమితులను తాకడంతో మాస్కో ఎక్స్ఛేంజ్‌లో రూబుల్, షేర్లు, ఫ్యూచర్‌లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.

Thu, 24 Feb 202205:41 AM IST

ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ క్లోజ్

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభం కావడంతో ఉక్రెయిన్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రష్యా దాడిని ఎదుర్కొంటున్న తూర్పు యూరోపియన్ దేశం నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా విమానం గురువారం ఉదయం ఉక్రెయిన్‌కు బయలుదేరింది. అయితే ఉక్రెయిన్ అధికారులు గురువారం ఉదయం పౌర విమానాల కార్యకలాపాల కోసం దేశ గగనతలాన్ని మూసివేసినందున ఎయిర్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం విమానాన్ని తిరిగి పిలవాలా లేదా దాని ప్రయాణాన్ని కొనసాగించాలా అని ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఎయిర్ ఇండియా విమానం AI 1947 ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7.30 గంటలకు కీవ్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.

Thu, 24 Feb 202205:10 AM IST

పుతిన్ ను ఆపాలి: ఉక్రెయిన్

రష్యా పోకడపై ఉక్రెయిన్ కూడా స్పందించింది. పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. కచ్చితంగా రష్యాకు బదులిస్తామని చెప్పింది. ఇప్పటికే శాంతియుతంగా ఉండే.. ఉక్రెయిన్ నగరాల్లో.. బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచ దేశాలు స్పందించి.. పుతిన్‌ను ఆపాలని ఉక్రెయిన్ కోరింది.

Thu, 24 Feb 202205:07 AM IST

పుతిన్ ప్రకటన.. కాసేపటికే..

మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైనట్టు స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ప్రకటించారు. పుతిన్ ప్రకటన చేసిన కాసేపటికే ఉక్రెయిన్‌ రాజధాని క్యీవ్, క్రామటోర్స్క్ నగరాల నుంచి పేలుళ్ల శబ్దం వచ్చింది. మరోవైపు.. రష్యా యుద్ధ విమానాలు ఈ నగరాల్లో బాంబుల వర్షం కురిపించినట్టుగా.. అంతర్జాతీయ వార్త సంస్థలు తెలిపాయి.

Fri, 11 Mar 202212:21 PM IST

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం