Red Fort Festival | ఇక ప్రతిరోజూ పండగే.. ఎర్రకోటపై శాశ్వతంగా మాతృభూమి ప్రదర్శనలు
ఎర్రకోటపై ప్రదర్శిస్తున్న 'మాతృభూమి' సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో ఇకపై ఏడాదంతా ప్రదర్శించాలని నిర్ణయించారు.
సుసంపన్నమైన భారతీయ వారసత్వాన్ని భారత భాగ్య విధాత పేరుతో దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై ప్రదర్శిస్తున్న 'మాతృభూమి' సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన, ఆదరణ లభిస్తున్నాయి. గత శుక్రవారం, మార్చి 25న ప్రారంభమైన ఈ పదిరోజుల ఉత్సవాలు నిన్నటితో ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఏప్రిల్ 3 వరకు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి.
అయితే ఈ ప్రదర్శనలను వీక్షించేందుకు ప్రజలు మంచి ఆసక్తిని కనబరుస్తుండటంతో, మాతృభూమి ప్రదర్శనలను చారిత్రాత్మక ఎర్రకోటలో శాశ్వతంగా ఏడాది పొడవునా ఇలాంటి కార్యక్రమాలను ఎర్రకోటపై కొనసాగించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది.
వీటిని ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రదర్శనలు అంటారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి చాటి చెబుతూ కాంతి, ధ్వని,సంగీతాన్ని ఉపయోగించి 'స్టార్-ఆఫ్-ది-ఆర్ట్ టెక్నాలజీతో అద్భుతమైన ప్రదర్శనలు ఎర్రకోటపై ప్రదర్శిస్తున్నారు.
భారతదేశ ఔన్నత్యం, వైవిధ్యమైన సంస్కృతి, స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర ప్రబింబించే ప్రదర్శనలను రూపొందించారు. ఈ ప్రదర్శనలు ప్రజలు దేశ చరిత్రను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు, వారిలో దేశభక్తి పెంపొందించేలా చేస్తున్నాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరుగుతున్న భారత భాగ్య విధాత కార్యక్రమం ఇప్పటికే దేశంలోనే గొప్ప సాంస్కృతిక సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఎర్రకోటలో ప్రదర్శించే ఇంటరాక్టివ్ సీక్వెన్స్ల ద్వారా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ భారతదేశం ఘన చరిత్రను, వారసత్వాన్ని భావి తరాలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో 'మాతృభూమి' ప్రదర్శనలను నిర్వహిస్తోంది.
ఇప్పటికే దేశంంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ ఉత్సవాన్ని వీక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఎర్రకోట కేవలం ఒక చారిత్రక స్మారక చిహ్నం మాత్రమే కాదు, దేశం తన సంకల్పం, వాగ్దానం, రాజ్యాంగంపై తన బాధ్యతను గ్రహించేలా చేసే సజీవ ఉదాహరణ అని అన్నారు.
ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు 30-నిమిషాల పాటు ప్రదర్శనలు ఉంటాయి. దీనిని సుందరంగా అందంగా అందరికీ అర్థమయ్యే విధంగా రూపొందించారు. ఇది దృశ్య శ్రవణ రూపంలో వీనులకు విందు అందిస్తుంది. ఈ ప్రదర్శనల కోసం ప్రజలందరికీ అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్