Roja Counter To Nagababu: గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన.. నాగబాబుపై రోజా స్ట్రాంగ్ కౌంటర్
Roja Counter To Nagababu: ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా మెగా బ్రదర్ నాగాబాబు మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. ఓ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేసిన రోజాను ఉద్దేశిస్తూ వెటకారంగా నాగబాబు ట్వీట్ చేయగా.. గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ రోజా ఘాటుగా స్పందించారు.
Roja Counter To Nagababu: జబర్దస్త్ షో ద్వార్ పాపులారిటీ తెచ్చుకున్న నటుల్లో రోజా, నాగబాబు ముందుంటారు. వీరిద్దరూ ఒకప్పుడు కలిసి జడ్జిలుగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఒకప్పుడు స్నేహంగా ఉన్న వీరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్సీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే రోజా ప్రస్తుతం ఏపీ టూరిజం మంత్రిగా ఉన్నారు. మరోపక్క నాగబాబు కూడా జనసేన పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ జనసేన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడతూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆర్కే రోజాపై తన విమర్శనాస్త్రం సంధించగా.. ఆమె కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే రోజా ఓ గ్రామంలో వాటర్ ట్యాంక్ను ప్రారంభిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు నాగబాబు వెటకారంగా ట్వీట్ చేశారు. "హంద్రీనివా సుజల స్రవంతి ప్రారంభించిన రోజా అంటూ ట్వీట్ చేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ(మాయ) పార్టీ నాయకురాలు రోజా ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 06.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించినట్లు సమాచారం. అని ఎద్దేవా చేశారు." ఇందుకు రోజా కూడా ఘాటుగానే స్పందించారు.
"ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసమే ఎదురుచూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ లాగి తాగునీరు ఇచ్చాము నాగబాబు. గాడిదకేమి తెలుసు గంధపు వాసన. నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా. ఆ గ్రామానికి వెళ్లి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం!" అని రోజా సోషల్ మీడియా వేదికగా కొన్ని వివరాలు షేర్ చేశారు.
అయితే వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ ఆసక్తికరంగా మారింది. ఇరువురు సపోర్టర్లు ఇద్దరి ట్వీట్లను షేర్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఇద్దరూ సరదాగా, స్నేహంగా ఉంటూ జబర్దస్త్ షోను హిట్ చేసిన వీరు.. ఇప్పుడు చాలా దారుణంగా ఒకరినొకరు కామెంట్లు చేసుకుంటున్నారని అంటున్నారు.
టాపిక్