మంచు మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జల్పల్లిలో మంగళవారం రాత్రి జరిగిన గొడవ తర్వాత మోహన్ బాబును అతని వద్ద ఉన్న గన్ను సబ్మిట్ చేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే.. ఇప్పటి వరకూ మోహన్ బాబు తన గన్ని సబ్మిట్ చేయలేదట.
రిపోర్టర్పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు స్టేట్మెంట్ను కూడా పోలీసులు ఇప్పటి వరకూ రికార్డ్ చేయలేదు. విచారణకి రెండు రోజుల్లో వస్తానని చెప్పిన మోహన్ బాబు ఇప్పటి వరకూ తమ వద్దకు రాలేదని.. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో అనే విషయంలో తమకి కనీసం సమాచారం కూడా లేదని పహడి షరీఫ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుని మోహన్ బాబు ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. హత్యాయత్నం కేసు కావడంతో.. మోహన్ బాబుకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ ప్రచారం జరిగినా.. లేదు నేను ఇంట్లోనే ఉన్నానంటూ అతను ట్వీట్ చేశాడు. కానీ.. పహడి షరీఫ్ పోలీసులు మాత్రం మోహన్ బాబు ఎక్కడ ఉండేది తమకి సమాచారం లేదని చెప్తున్నారు.
జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి జరిగిన గొడవపై ఇప్పటికే మంచు విష్ణు, మంచు మనోజ్పై రాచకొండ కమిషనరేట్లో బైండోవర్ చేశారు. విచారణకి మోహన్ బాబు హాజరైనా.. అతనిపై కూడా బైండోవర్ చేసే అవకాశం ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా చూపుతూ మోహన్ బాబు విచారణకి వెళ్లలేదు. అలానే తన గన్ను కూడా ఇప్పటి వరకూ సబ్మిట్ చేయలేదు. దాంతో పోలీసులు ఏం చేయబోతున్నారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
జర్నలిస్ట్పై దాడి తర్వాత మోహన్ బాబుపై తొలుత పహడి షరీఫ్ పోలీసులు బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసు విచారణ నిమిత్తం వచ్చినప్పుడు గన్ను సబ్మిట్ చేస్తానని మోహన్ బాబు చెప్పారట. కానీ.. ఇప్పటి వరకూ అతని నుంచి సమాచారం రాలేదని.. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే తమకి అందుబాటులోకి వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు.