Balakrishna Akkineni Controversy: నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య వ్యాఖ్యలు అక్కినేని ఫ్యాన్స్ను ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందించాడు. కళామతల్లి ముద్దుబిడ్డలను అగౌరవపరచడం మనల్ని మనం కించపరచుకోవడమేనని స్పష్టం చేశాడు.
"నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం" అని అక్కినేని నాగచైతన్య తన ట్విటర్ వేదికగా పోస్టును పెట్టాడు. ఇదే విషయాన్ని అఖిల్ అక్కినేని కూడా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
ఇటీవల జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో భాగంగా మాట్లాడిన బాలయ్య.. వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్ గురించి ప్రస్తావం తీసుకొచ్చారు. "ఇక ఈయన ఉన్నారంటే సెట్లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం" అని అనేశారు. 'అక్కినేని.. తొక్కినేని' అనగానే అది ఎవరి గురించి అన్నారో అర్థం చేసుకున్న సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే బాలయ్య ఫ్లోలో మరో వ్యక్తి గురించి మాట్లాడటంతో ఎవరూ ఈ విషయాన్ని అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.
అయితే అక్కడ వారు పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధంగా అహంకార పూరిత మాటలు మాట్లాడటం తగదని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం