Sandeep Reddy Vanga: చిరంజీవి అవకాశం ఇస్తే అలాంటి మూవీ తీస్తా: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే తన కోరికను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. అవకాశం వస్తే ఏ జానర్ మూవీ చేస్తానో కూడా తెలిపారు.
Sandeep Reddy Vanga: యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ప్రస్తుతం సినీ జనాల్లో మార్మోగుతోంది. తెలుగులో అర్జున్ రెడ్డి (2017).. ఆ తర్వాత బాలీవుడ్లో దాని రీమేక్ కబీర్ సింగ్(2019)తో సందీప్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా ఈ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో.. విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజై.. ఇప్పటికే రూ.600కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే, యానిమల్ మూవీపై కూడా విమర్శలు బలంగానే వస్తున్నాయి. అయితే, అంతకు మించి బ్లాక్బాస్టర్ హిట్ అవుతోంది.
యానిమల్ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రచారం కోసం ఆయన ప్రస్తుతం అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఓ మూవీ చేయాలని ఉందని అన్నారు. చిరూతో యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఇష్టపడతానని తెలిపారు.
“ఒకవేళ అవకాశం ఇస్తే, మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా చేయాలని ఉంది” అని తన మనసులో మాటను సందీప్ రెడ్డి వంగా చెప్పారు. తనకు చిరంజీవి ఇష్టమని గతంలో కూడా సందీప్ వెల్లడించారు. ఇప్పుడు ఆయనతో సినిమా తీయాలనుందంటూ వెల్లడించారు.
సినిమాను.. సినిమాలాగే చూడాలి
యానిమల్ సినిమా.. మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై కూడా సందీప్ పరోక్షంగా స్పందించారు. సినిమాను సినిమాలాగే చూడాలని అన్నారు.
“ఇక్కడికి వచ్చిన వారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. మహిళలపై ద్వేషం గురించి ఎవరూ ప్రశ్నలు వేయలేదు. మీరు సరైన ప్రేక్షకులు. మీరు యానిమల్ను ఓ సినిమాలానే చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది” అని సందీప్ వంగా చెప్పారు.
యానిమల్ సినిమాలో హింస ఎక్కువగా ఉందని, మహిళలను కించపరిచే విధంగా చూపించారంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సమాజంపై ఈ చిత్రం చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శిస్తున్నారు. మరోవైపు, యానిమల్ సినిమాకు మాత్రం కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.
యానిమల్ చిత్రం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. సంజూను దాటేసి రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా దూసుకెళుతోంది. యానిమల్ సినిమాలో రష్మిక మందన్నా, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి కీలకపాత్రలు చేశారు.
సంబంధిత కథనం