Lok Sabha Polls 2024: ఫేజ్ 2 లో కర్నాటకలోని ఈ కీలక నియోజకవర్గాల్లో పోలింగ్-lok sabha polls 2024 phase 2 karnatakas key constituencies candidates to look ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Polls 2024: ఫేజ్ 2 లో కర్నాటకలోని ఈ కీలక నియోజకవర్గాల్లో పోలింగ్

Lok Sabha Polls 2024: ఫేజ్ 2 లో కర్నాటకలోని ఈ కీలక నియోజకవర్గాల్లో పోలింగ్

HT Telugu Desk HT Telugu
Apr 23, 2024 06:13 PM IST

Lok Sabha elections 2024: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరగనుంది. కర్నాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉండగా, ఏప్రిల్ 26న జరిగే రెండో దశ ఎన్నికల్లో 14 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ దశ పోలింగ్ ద్వారా కర్నాటకలోని పలువురు కీలక నేతల భవితవ్యం తేలనుంది.

ఫేజ్ 2 లో కర్నాటకలోని 14 స్థానాల్లో పోలింగ్
ఫేజ్ 2 లో కర్నాటకలోని 14 స్థానాల్లో పోలింగ్ (Hindustan Times)

Lok Sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. కీలకమైన రాష్ట్రమైన కర్నాటకలో ఏప్రిల్ 26 తో పాటు మే 7వ తేదీన కూడా పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26న 14 నియోజకవర్గాల్లో, మే 7వ తేదీన మిగిలిన 14 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.

కాంగ్రెస్, బీజేపీల మధ్య..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections) కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమి పాలైంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికల్లోనూ కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పని పరిస్థితి నెలకొన్నది. మరోసారి కర్నాటకలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా, అసెంబ్లీ ఎన్నికల జోరును కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

2019 లో బీజేపీ హవా

కర్నాటక (karnataka) లో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉండగా, ఏప్రిల్ 26న 14 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ బెంగళూరు సౌత్, మాండ్య, మైసూరు నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులు పోటీలో ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 51.2 శాతం ఓట్లతో 25 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందారు. 2024 లోక్ సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 25 సీట్లలో పోటీ చేస్తోంది. రాష్ట్రంలో దాని మిత్రపక్షం జేడీఎస్ మిగిలిన మూడు స్థానాలైన హసన్, మాండ్య, కోలార్ లలో పోటీ చేస్తోంది.

ఈ స్థానాలు కీలకం

జేడీఎస్ పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాలకు ఏప్రిల్ 26 న రెండవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో, మాండ్య స్థానంలో జేడీఎస్ నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడతో తలపడుతున్నారు. హసన్ స్థానంలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ గౌడతో తలపడుతున్నారు. అలాగే, బెంగళూరు సౌత్ స్థానంలో బీజేపీ యువనేత తేజస్వీ సూర్య బరిలో ఉన్నారు. మైసూరు నియోజకవర్గంలో యదువీర్ వడయార్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన మైసూరు రాజవంశానికి చెందినవాడు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బీజేపీ ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చింది. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ బెంగళూరు రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రెండో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా సురేశ్ నిలిచారు.

WhatsApp channel