శ్రీవారికి నాసిరకం జీడిపప్పు సరఫరా.... కాంట్రాక్టు రద్దు చేయాలని ఛైర్మన్ ఆదేశం-ttd chairman inspects in tirumala marketing godown ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Chairman Inspects In Tirumala Marketing Godown

శ్రీవారికి నాసిరకం జీడిపప్పు సరఫరా.... కాంట్రాక్టు రద్దు చేయాలని ఛైర్మన్ ఆదేశం

HT Telugu Desk HT Telugu
May 28, 2022 06:49 PM IST

శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఓ కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేకపోవడంతో కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి అవసరాలకు సరిపడా జీడిపప్పు మార్కెట్లో లభించకపోవడంతో సొంతంగా బద్దలు ఒలిచే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది.

శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం జీడిపప్పు ఒలుస్తున్న భక్తులు
శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం జీడిపప్పు ఒలుస్తున్న భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్‌ గోడౌన్‌‌ను శనివారం మధ్యాహ్నం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. టీటీడీకి మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఓ కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ము, విరిగిపోయినవి ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. టీటీడీ షరతు కంటే ఎక్కువగా దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నాయని అధికారులు చైర్మన్‌కు వివరించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు అధికారులు వివరించారు. నాణ్యత సరిగాలేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు.

టీటీడీకి సరఫరా చేసిన యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాయా లేదా అని అధికారులను ప్రశ్నించారు. వాసన సరిగా రాకపోవడంతో ప్రభుత్వ పరీక్ష కేంద్రానికి పంపాలని చైర్మన్ ఆదేశించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి డబ్బా తెరిపించి నెయ్యి వాసన పరిశీలించారు. నెయ్యి వాసన గొప్పగా లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీవారి సేవకులు జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ఛైర్మన్ పరిశీలించారు. జీడిపప్పు నాణ్యత ఎలా ఉందని, సేవ ఎన్ని రోజులు చేస్తారు, ఎక్కడి నుంచి సేవకు వచ్చారని శ్రీవారి సేవకులతో అడిగి తెలుసుకున్నారు.

<p>జీడిపప్పు నాణ్యత పరిశీలిస్తున్న టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి</p>
జీడిపప్పు నాణ్యత పరిశీలిస్తున్న టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి

స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు ఏటా రూ 500 కోట్లు ఖర్చు చేసి జీడిపప్పు, నెయ్యి, యాలకులు కోనుగోలు చేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేసినట్లు వివరించారు. సరుకులు టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

<p>శ్రీవారి ప్రసాదాలకు సరఫరా చేసే యాలకుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించిన ఛైర్మన్</p>
శ్రీవారి ప్రసాదాలకు సరఫరా చేసే యాలకుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించిన ఛైర్మన్

శ్రీ‌వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల త‌యారీ కోసం టిటిడి సాధారణంగా టెండర్ల ద్వారా జీడిపప్పును కొనుగోలు చేస్తుంది. జీడిపప్పు బ‌ద్దలు త‌గినంత మొత్తంలో ల‌భించ‌క‌పోవ‌డంతో మార్చి 21న తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌తో జీడిపప్పు బ‌ద్దల‌ సేవను ప్రారంభించారు. గత 52 రోజుల్లో శ్రీ‌వారి సేవ‌కులు 26 వేల‌ కిలోల జీడిపప్పును బ‌ద్దలుగా మార్చార‌ు. రోజుకు 100 మంది చొప్పున ఇప్పటివ‌ర‌కు తిరుప‌తిలో 5200 మంది సేవకులు ఈ సేవ‌లో పాల్గొన్నార‌ు. తిరుమలలో ప్రతి రోజు ప్రసాదాల తయారీకి 3500 కిలోల నుండి 4000 కిలోల వరకు జీడిపప్పు బద్దలు అవ‌స‌ర‌మ‌వుతాయి. దీనితో తిరుమ‌ల‌లో కూడా శ్రీ‌వారి సేవ‌కుల‌తో జీడిప‌ప్పు బ‌ద్దల సేవను ప్రారంభించారు.విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప‌లు సంస్థలు జీడిప‌ప్పును బద్దలుగా మార్చే యంత్రాలను త‌యారు చేస్తుండటంతో, యంత్రాలతో జీడిపప్పు ఒలిచేందుకుఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే యంత్రాలతో ట్రయల్ రన్‌ కూడా నిర్వహించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

IPL_Entry_Point

టాపిక్