YSRCP : వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - గుడ్ బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి
YCP MLA Kapu Ramachandra Reddy: వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ప్రకటించారు.
YCP MLA Kapu Ramachandra Reddy: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మార్పుల పేరుతో అధికార వైసీపీ భారీ కసరత్తు చేస్తుండగా… పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు.
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిసిన అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఓ దండం అంటూ కామెంట్స్ చేసిన ఆయన… సీఎంవో నుంచి వచ్చి తీవ్ర ఆవేదనతో మాట్లాడారు.- జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చానని గుర్తు చేశారు. ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశామని చెప్పారు. ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని… ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందన్నారు.
“జగన్ వైసీపీ పార్టీ పెడితే 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకుని వచ్చా. జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. నాకు మంత్రి పదవి ఇస్తానన్న జగన్ ..ఇవ్వ లేదు. రాత్రనకా పగలనకా గడపగడపకు తిరిగాం. ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశాం. సర్వే రిపోర్టు పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధగా ఉంది. టికెట్ ఇవ్వడం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఇంతకన్నా అవమానం మరోటి లేదు. వైకాపా పార్టీ నుంచి మేము వెళ్లిపోతున్నాం. మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు. మా జీవితాలు సర్వ నాశనమయ్యాయి. ఈ రోజుకీ జగనే మా సర్వస్వం అని భావించాం. జగన్ ను మా దేవుడితో సమానంగా చూశాం. ఇలా నమ్మించి గొంతు కోస్తారని ఊహించలేదు. రామచంద్రారెడ్డి అంటే కరడుకట్టిన జగన్ ,వైఎస్ ఆర్ అభిమాని. మేం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. కనీసం జగన్ మమ్మల్ని కలిసేందుకు ఇష్టపడలేదు. మా ఆవేదన చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కలవనివ్వలేదు. సీఎం బిజీగా ఉన్నారని , కలిసేందుకు వీలుకాదన్నారు” రామచంద్రారెడ్డి.
ఏ పార్టీవైపు కూడా ఇప్పటి వరకు కనీసం చూడలేదన్నారు కాపు రామచంద్రారెడ్డి. “ రాయదుర్గం ,కళ్యాణదుర్గం నుంచి మేము పోటీ చేస్తాం. కళ్యాణ దుర్గం నుంచి నేను ఇండి పెండెంట్ గానైనా పోటీ చేస్తా. రాయదుర్గం నుంచి నా భార్య పోటీ చేస్తారు. ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి గెలిచే సత్తా మాకు ఉంది” అని కాపురామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.